మోదీ, గడ్కరీలకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
- కొప్పర్తి-కడప బైపాస్ రహదారికి రూ. 304 కోట్లు కేటాయించిన కేంద్రం
- రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్న పవన్ కల్యాణ్
- ఈ ప్రాజెక్టు కారణంగా రాయలసీమలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని వెల్లడి
కడప జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ ను కడప బైపాస్తో అనుసంధానించే నూతన రహదారి నిర్మాణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టు మంజూరుతో పాటు రూ. 304.44 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర మౌలిక వసతుల కల్పనకు, పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారం అభినందనీయమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్లో (VCIC) కొప్పర్తి అత్యంత కీలకమైన నోడ్గా ఉందన్న ఆయన... కొత్తగా నిర్మించే అనుసంధాన రహదారి అందుబాటులోకి వస్తే పారిశ్రామిక సరుకు రవాణా మరింత వేగవంతం, సులభతరం అవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఫలితంగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో పాటు, భారీ స్థాయిలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగి రాయలసీమ ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.