లక్ష్యాలు చేరకపోతే ఈ సమావేశాలెందుకు?: ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు

లక్ష్యాలు చేరకపోతే ఈ సమావేశాలెందుకు?: ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో చంద్రబాబు

Chandrababu Naidu asks why hold meetings if targets are not reached at SLBC
  • 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం
  • అన్ని వర్గాలను బలోపేతం చేసేలా రుణాలు అందించాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచన
  • రుణాల మంజూరులో కొన్ని బ్యాంకులు వెనుకబడటంపై సీఎం అసంతృప్తి
  • రుణాల చెల్లింపులో ఎస్హెచ్‌జీ మహిళలు దేశంలోనే నంబర్-1 అని ప్రశంస
  • పీఎం సూర్యఘర్ పథకానికి పెద్దఎత్తున రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • కౌలు రైతులకు రుణసాయం పెంచాలని బ్యాంకులకు దిశానిర్దేశం
రాష్ట్రంలోని అన్ని రంగాలను, వర్గాలను బలోపేతం చేసేలా రుణాలను అందించాలని, లక్ష్యాలను చేరుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. అమరావతిలో బుధవారం జరిగిన 236వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ఆయన పాల్గొని, వివిధ అంశాలపై అధికారులకు, బ్యాంకర్లకు కీలక దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఇలాంటి సమావేశాలు నిర్వహించి ప్రయోజనం ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మొత్తం గతంతో పోలిస్తే పెరిగినప్పటికీ, ఆశించిన స్థాయిలో మంజూరు జరగలేదు. కొన్ని బ్యాంకులు ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి" అని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యం ఉందని, ఇందుకు బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు అందించి సహకరించాలని కోరారు.

స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు రుణాల చెల్లింపులో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. "రుణాలు తీసుకున్న వారిలో 99 శాతానికి పైగా మహిళలు సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. ఈ విషయంలో ఏపీ ఎస్‌హెచ్‌జీ మహిళలు దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచారు. కేవలం 0.67 శాతం మంది మాత్రమే చెల్లింపుల్లో విఫలమవుతున్నారు. వీరి నుంచి బకాయిలు వసూలు చేసేందుకు 'వన్ టైమ్ సెటిల్‌మెంట్' (ఓటీఎస్) విధానంపై ఆలోచించాలని బ్యాంకులకు సూచిస్తున్నాను" అని వివరించారు.

రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే ఎల్‌నినో కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతికూలతలను అధిగమించి ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా, రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలకమైన కౌలు రైతులకు రుణాలు సమృద్ధిగా అందించేందుకు బ్యాంకులు చొరవ చూపాలని ఆయన కోరారు.
Advertisement
Chandrababu Naidu
SLBC meeting Andhra Pradesh
MSME loans AP
SHG women loan repayment
PM Surya Ghar scheme
Tenant farmer loans

More Telugu News