తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సుల సేవలను ప్రారంభించిన చంద్రబాబు
- టీటీడీకి ఈవీ బస్సులను విరాళంగా ఇచ్చిన రిలయన్స్, బయోటెక్
- వాహన ఛార్జింగ్ స్టేషన్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన రిలయన్స్
- పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం
తిరుమల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తులకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలను అందించేందుకు సిద్ధం చేసిన ఉచిత ఈవీ బస్సుల సేవలు బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల శుభసందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలలో ఘనంగా ప్రారంభించారు.
పర్యావరణహిత రవాణా కోసం రిలయన్స్ సంస్థ 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించగా, బయోటెక్ సంస్థ 7 బస్సులను టీటీడీకి ఉచితంగా అందజేసింది. బస్సులతో పాటుగా ‘జియో-బీపీ’ సహకారంతో ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్, ఇతర మౌలిక సదుపాయాలను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసింది.
గత జూన్ నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, తిరుమల కొండపై కాలుష్యాన్ని తగ్గించేందుకు టీటీడీకి రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా 25 ఈవీ బస్సులను విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బస్సులు కొండపైకి చేరుకుని నేడు భక్తుల సేవలకు అందుబాటులోకి వచ్చాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు మాడ వీధులు, కాటేజీలు మరియు దర్శన క్యూలైన్ల వద్దకు ఉచితంగా చేరుకోవడానికి ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.