ఈ వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: దాసరి శ్యామ్ చంద్రశేషు

ఈ వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: దాసరి శ్యామ్ చంద్రశేషు

Dasari Shyam Chandrasheshu slams Jagan Mohan Reddy for baseless allegations on Mega DSC
  • ఏపీపీఎస్సీ కుంభకోణం నుంచి దృష్టి మళ్లించడానికే డీఎస్సీపై జగన్ ఆరోపణలు
  • 98% అవకతవకలు జరిగిన ఏపీపీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణకు జగన్ సిద్ధమా అని ప్రశ్న
  • పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై 323 కేసులు వేసినా కోర్టులు కొట్టివేశాయని వెల్లడి
  • అభివృద్ధి పనుల ఘనతను జగన్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • దిగజారుడు రాజకీయాలు చేస్తే వైసీపీకి ఉన్న 11 సీట్లు కూడా దక్కవని హెచ్చరిక
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన భారీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మాజీ ముఖ్యమంత్రి జగన్ మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీఎస్సీపై విషం చిమ్ముతూ నిరుద్యోగులను అయోమయానికి గురిచేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడమే కాదు, వాటిని అమలు చేసి యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని, ఈ నిజాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

డీఎస్సీపై ఆరోపణలు... డైవర్షన్ కోసమే

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారని, మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని శ్యామ్ చంద్రశేషు స్పష్టం చేశారు. ఈ నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు 323 కేసులు వేసినా, ఏ ఒక్క కోర్టు కూడా ప్రభుత్వంలో లోపాలున్నాయని చెప్పలేదని, కనీస ఆధారాలు లేవని అన్ని పిటిషన్లను కొట్టివేసిందని గుర్తుచేశారు. "బహిరంగ చర్చకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరితే తోక ముడిచి పారిపోయిన జగన్, ఇప్పుడు మీడియా ముందు గంటల తరబడి అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు. మీ దగ్గర ఆధారాలుంటే కోర్టుకు సమర్పించాలి కానీ, ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం మానుకోవాలి" అని హెచ్చరించారు.

ఏపీపీఎస్సీ పాపాలు కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు

జగన్ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన చారిత్రాత్మక కుంభకోణంపై సిట్ దర్యాప్తులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయని శ్యామ్ చంద్రశేషు ఆరోపించారు. 

"సిట్ నివేదిక ప్రకారం, 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపగా, ఏకంగా 718 షీట్లలో (97.55%) మార్పులు జరిగినట్లు తేలింది. ఉద్యోగాలకు ఎంపికైన 165 మందిలో 160 మంది ఓఎంఆర్ షీట్లను మార్చి ఉద్యోగాలు కట్టబెట్టారు. 98 శాతం అవకతవకలు జరిగిన మీ హయాంలోని ఏపీపీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ కోరే దమ్ము జగన్‌కు ఉందా?" అని ఆయన సవాల్ విసిరారు. తమ పాపాలు బయటపడి ఉన్న 11 సీట్లు కూడా ఊడిపోతాయనే భయంతోనే జగన్ డీఎస్సీపై బురద జల్లుతున్నారని విమర్శించారు.

క్రెడిట్ దొంగ జగన్.. కాకి నెమలి కాలేదు

"దొంగే ‘దొంగ దొంగ’ అని అరిచినట్టుగా జగన్ తీరు ఉంది. 16 నెలలు జైలు జీవితం గడిపిన ఆర్థిక ఉగ్రవాది, ఇతరులను నిందించడం హాస్యాస్పదం" అని శ్యామ్ చంద్రశేషు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి కార్యక్రమాల ఘనతను జగన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారని, ఇది ‘క్రెడిట్ చోరీ’ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. 

"భోగాపురం విమానాశ్రయం, పోలవరం కాలువ పనులు, వెలిగొండ ప్రాజెక్టు వేగవంతం అవుతుంటే అదంతా తన ఘనతేనని చెప్పుకుంటున్నారు. కాకి నెమలి ఈకలు తగిలించుకున్నంత మాత్రాన నెమలి కాలేదు. చంద్రబాబు నిజమైన అభివృద్ధి ప్రదాత అయితే, జగన్ అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాకి లాంటి వారు" అని పోల్చారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా పరదాల చాటున ఉన్న జగన్‌కు, అధికారం కోల్పోయాక రాజకీయ లబ్ధి కోసం శవాలు కావాల్సి వస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 8 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంటే, జగన్ మాత్రం విద్వేష రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉన్న సీట్లు కూడా గల్లంతై, ఆ పార్టీ శాశ్వతంగా కనుమరుగవడం ఖాయమని శ్యామ్ చంద్రశేషు హెచ్చరించారు.
Advertisement
Dasari Shyam Chandrasheshu
Jagan Mohan Reddy
APPSC Scam
Mega DSC
Andhra Pradesh Politics
TDP News

More Telugu News