22ఏ భూములపై చర్చకు డిమాండ్.. మండలిలో రసాభాస.. బీఆర్ఎస్ వాకౌట్
- చైర్మన్ పోడియం వైపు దూసుకెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు
- 22ఏ భూములపై చర్చకు అనుమతించపోవడంతో వాకౌట్ చేసిన సభ్యులు
- మార్షల్స్ వ్యవహరించిన తీరుపై మధుసూదనాచారి మండిపాటు
తెలంగాణ శాసనమండలిలో 22ఏ నిషేధిత భూముల వివాదంపై ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ రికార్డులు, 22ఏ భూములకు సంబంధించిన సమస్యలపై తక్షణమే పూర్తిస్థాయి చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే మండలి చైర్మన్ ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ, ముందస్తు ఎజెండా ప్రకారం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. చైర్మన్ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు పోడియం వైపు దూసుకెళ్లి నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సభను సజావుగా సాగనివ్వాలని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని సహకరించాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు శాంతించలేదు. ప్రభుత్వం చర్చకు భయపడుతోందని ఆరోపిస్తూ సభ జరుగుతున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులందరూ మండలి నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.
వాకౌట్ అనంతరం మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ... శాసనమండలి ప్రాంగణంలో ప్రతిపక్ష సభ్యుల పట్ల మార్షల్స్ ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధుల హక్కులను భంగపరిచేలా మార్షల్స్ వ్యవహరించడం శోచనీయమని ఆయన మండిపడ్డారు.