రేవంత్ రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం: హరీశ్రావు
- కాంగ్రెస్ పార్టీ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా దాడి చేస్తోందన్న హరీశ్
- ఫేక్ అకౌంట్లలోని పోస్టులను అసెంబ్లీలో రేవంత్ ప్రస్తావిస్తున్నారని మండిపాటు
- సభకు, ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఫేక్ అకౌంట్లను సృష్టించి ప్రతిపక్షాలపై అత్యంత దుర్మార్గమైన దాడికి పాల్పడుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులే స్వయంగా నిర్వహిస్తున్న ఒక ఫేక్ అకౌంట్లోని పోస్టులను పట్టుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం కన్నా దౌర్భాగ్య పరిస్థితి మరొకటి లేదని ఎద్దేవా చేశారు.
తాజాగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న ‘సంధ్యా రావు’ అనే ఫేక్ అకౌంట్ వెనుక కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లర్లే ఉన్నారని హరీశ్రావు ఆరోపించారు. ఆ నకిలీ ఖాతాలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ముఖ్యమంత్రి శాసనసభను తప్పుదోవ పట్టించారని, దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే సభకు, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు ఫేక్ అకౌంట్పై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, దాని వెనుక ఉన్న ముఠాను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన అంశంపై ముఖ్యమంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని... అలాగే ఈ పరువు నష్టం, నకిలీ ఖాతాల వ్యవహారంపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.