ముగ్గురు పిల్లలతో లోయలోకి దూకి జాతీయ మహిళా రెజ్లర్ ఆత్మహత్య
- మహారాష్ట్ర టైగ్రెస్ గా పేరుగాంచిన రెజ్లర్ అశ్విని
- జాతీయ స్థాయిలో 5 స్వర్ణాలు, 6 రజతాలు సాధించిన రెజ్లర్
- భర్త, అత్తమామల వేధింపులే ఆత్మహత్యకు కారణం
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా విషాద ఘటన చోటుచేసుకుంది. 'మహారాష్ట్ర టైగ్రెస్'గా పేరొందిన జాతీయ మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి నల్దుర్గ్ కోటపై నుంచి 100 అడుగుల లోతైన లోయలోకి దూకింది. ఈ దారుణ ఘటనలో అశ్విని, ఆమె ఐదేళ్ల కుమారుడు అజింక్యా అక్కడికక్కడే మృతి చెందగా, కవల కుమార్తెలలో క్రాంతి ఆసుపత్రిలో కన్నుమూసింది. మరో చిన్నారి వీరా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతోంది.
జాతీయ స్థాయిలో 5 స్వర్ణాలు, 6 రజత పతకాలు సాధించిన అశ్విని మృతిపై తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. భర్త, అత్తమామల శారీరక, మానసిక వేధింపుల వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని అశ్విని తండ్రి ఫిర్యాదు చేయడంతో నల్దుర్గ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.