ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలోకి తెచ్చింది చంద్రబాబే: కాలవ శ్రీనివాసులు
- పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పునాదులు వేశారన్న కాలవ శ్రీనివాసులు
- సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కితాబు
- ఎన్టీఆర్ కలలను నెరవేర్చేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయాలను నిబద్ధతతో ఆచరణలోకి తీసుకొచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కొనియాడారు. అనంతపురంలో నిర్వహించిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పేదల సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ఆత్మగౌరవ పాలనే ధ్యేయంగా ఎన్టీఆర్ వేసిన పునాదులపైనే చంద్రబాబు నేడు సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు.
తెలుగుజాతి వికాసం కోసం ఎన్టీఆర్ కన్న కలలను నెరవేర్చేందుకు చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ, ప్రతి పేద కుటుంబానికి అండగా నిలిచేలా 'దీపం' పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, కొత్త పింఛన్ల మంజూరు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం అవుతూ, పార్టీ శ్రేణులంతా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.