ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని షూటింగ్ చేశాం.. మళ్లీ ఇంత రిస్క్ చేయను: సుహాస్
- సుహాస్, సూరి కాంబినేషన్లో తెరకెక్కిన 'మండాడి'
- 45 రోజుల పాటు సముద్రంలోనే షూటింగ్ చేశామన్న సుహాస్
- సముద్రంలో అడుగడుగునా ప్రమాదాలు ఎదురయ్యాయని వెల్లడి
టాలీవుడ్ హీరో సుహాస్, తమిళ నటుడు సూరి కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘మండాడి’ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సుహాస్... సముద్రం నేపథ్యంలో సాగే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో తాము ఎదుర్కొన్న భయానక, ప్రమాదకర పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
‘మండాడి’ క్లైమాక్స్ కోసం దాదాపు 45 రోజుల పాటు ఏకధాటిగా సముద్రంలోనే షూటింగ్ నిర్వహించామని సుహాస్ తెలిపాడు. ఆ సమయంలో అడుగడుగునా ప్రమాదాలు ఎదురయ్యాయని, మూడు నాలుగు సార్లు సముద్రపు అలల ధాటికి బోట్లు తిరగబడి, ప్రాణాలు కోల్పోయేంతటి తీవ్రమైన రిస్క్ అనుభవించామని చెప్పాడు. కెమెరామెన్లు సైతం నీటిలో పడిపోయారని, నెట్వర్క్ సిగ్నల్స్ లేని ఆ వాతావరణంలో జీవితం విలువ ఏంటో తనకు అర్థమైందని వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు నా కెరీర్లో చేసిన అత్యంత ప్రమాదకరమైన చిత్రం ఇదేనని, జీవితం కంటే సినిమా ఏదీ ఎక్కువ కాదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ ఇంతటి రిస్క్ ఉన్న సినిమాలు చేయబోనని స్పష్టం చేశాడు.
అయితే, కథలోని గాఢత, నిర్మాతలు చూపించిన నమ్మకం వల్లే ఇంతటి సాహసానికి ఒడిగట్టామని సుహాస్ వెల్లడించాడు. కో-స్టార్ సూరితో పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఆయన సెట్స్లో అందరినీ నవ్విస్తూ సందడి చేస్తారని కొనియాడాడు.