ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. ఇది చంద్రబాబు విజన్: మంత్రి నిమ్మల

Godavari waters for North Andhra is Chandrababu vision says Minister Nimmala
  • పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు
  • ఇది చంద్రబాబు ముందుచూపు వల్లే సాధ్యమైందని కొనియాడిన మంత్రి నిమ్మల
  • గత ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్‌పై వైసీపీ ప్రభుత్వం తట్ట మట్టి కూడా వేయలేదని ఆరోపణ
  • పోలవరం ఆలస్యం వల్ల ఈ ఏడాది 350 టీఎంసీల గోదావరి నీరు వృథా అయ్యిందని విమర్శ
  • పట్టిసీమ, పురుషోత్తపట్నంలను విమర్శించిన జగన్ అవే పథకాలపై ఆధారపడాల్సి వచ్చిందని వ్యాఖ్య
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని తాకాయని, ఇది ముఖ్యమంత్రి, అపర భగీరథుడు చంద్రబాబు దార్శనికత వల్లే సాధ్యమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కొనియాడారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీరు చేరడం రాష్ట్ర జలవనరుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు గోదావరి జలాలకు హారతి పట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నిమ్మల రామానాయుడు మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలన్న చంద్రబాబు ముందుచూపు వల్లే ఈరోజు ఈ ప్రాంత ప్రజల దాహం తీరుతోందని మంత్రి అన్నారు. "2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం గడువులోగా పూర్తి చేసి ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొచ్చాం" అని ఆయన స్పష్టం చేశారు. 

ఈ రెండేళ్ల కాలంలోనే ఏలేరు, పంప, తాండవ, శారద, వరాహ వంటి ఐదు ప్రధాన నదులను, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ కెనాల్ నిర్మాణంలో ఉన్న క్లిష్టమైన పనులను పూర్తి చేశామని తెలిపారు. కొమ్మరిలోవ వద్ద 100 మీటర్ల లోతైన కొండను తవ్వి కాలువను తీసుకురావడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నిమ్మల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంచి చేసే కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రాన్ని ముంచేసిన "గొడ్డలి పార్టీ"కి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని కోరుతూ మూడు కీలక విషయాలను ప్రస్తావించారు. "మొదటిది, గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కనీసం ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, అరబస్తా సిమెంట్ వాడలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అలాంటి పార్టీకి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదు" అని ఆరోపించారు.

"రెండోది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీలో పట్టిసీమను 'వట్టిసీమ' అని, పురుషోత్తపట్నం పనికిరాదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే ఆ పంపులను పీకేస్తానని హెచ్చరించారు. కానీ ఈరోజు అవే పట్టిసీమ పంపులు కృష్ణా డెల్టా ఆయకట్టును ఆదుకుంటున్నాయి. సూపర్ ఎల్ నినో సంవత్సరంలో కూడా 32 టీఎంసీల నీటిని అందించాం. అదేవిధంగా, ఆయన పీకేస్తానన్న పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారానే నేడు ఉత్తరాంధ్రకు నీళ్లు వస్తున్నాయి. ఇది చంద్రబాబు ముందుచూపునకు, గొడ్డలి పార్టీ విధ్వంసకర పాలనకు మధ్య ఉన్న తేడా" అని మంత్రి విమర్శించారు.

"మూడవది, 2019 నాటికి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశారు. ఆయన అధికారంలో కొనసాగి ఉంటే 2021కే ప్రాజెక్ట్ పూర్తయ్యేది. కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, డయాఫ్రం వాల్ ధ్వంసం వంటి చర్యల వల్ల ప్రాజెక్టును నాశనం చేశారు. పోలవరం పూర్తయి ఉంటే, ఈ సూపర్ ఎల్ నినో సంవత్సరంలో కూడా గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసిన 900 టీఎంసీల వరద నీటిలో కనీసం 300 నుంచి 350 టీఎంసీలను కృష్ణా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు తరలించేవాళ్లం" అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలుగు జాతి భారీగా నష్టపోయిందని, ఈ ముంచేసే గొడ్డలి పార్టీని ఉత్తరాంధ్ర ప్రజలు తరిమి తరిమి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Nimmala Rama Naidu
Polavaram Left Main Canal
Godavari Water Uttarandhra
Purushothapatnam Lift Irrigation
Andhra Pradesh Water Resources

More Telugu News