ఈ దైవ సంకల్పం చంద్రబాబు రూపంలో నెరవేరింది: పాయకరావుపేటలో అనిత

Vangalapudi Anitha hails Chandrababu Naidu for completing Polavaram left canal works
  • పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు
  • సీఎం చంద్రబాబు సంకల్పం వల్లే ఐదు దశాబ్దాల కల నెరవేరిందన్న హోంమంత్రి అనిత
  • గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును దెబ్బతీసిందని విమర్శ
  • చంద్రబాబు అపర భగీరథుడని, ఒక్క ఓటుతోనే గోదారిని తెచ్చుకున్నామని వ్యాఖ్య
  • పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా
ఉత్తరాంధ్ర దశాబ్దాల కలను సాకారం చేస్తూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఈ ప్రాంతానికి చేరాయి. ఈ చారిత్రక ఘట్టంపై రాష్ట్ర హోం శాఖ మంత్రి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పం, అవిశ్రాంత కృషి వల్లే సాధ్యమైందని కొనియాడారు. "నీరు ఉన్నచోటే జీవం, ప్రగతి, అభివృద్ధి ఉంటాయి. ఐదు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న కలను నిజం చేసిన మహానీయుడు చంద్రబాబు" అని ఆమె ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనిత మాట్లాడుతూ.. "పోలవరం కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అదొక జీవనాడి, ఒక ఎమోషన్. మన చిన్నతనం నుంచి వింటున్న పోలవరం ఈరోజు కళ్లముందు సాకారం కావడం చంద్రబాబు దయవల్లే సాధ్యమైంది. ఆలోచనలు ఎవరికైనా వస్తాయి, కానీ వాటిని కార్యరూపంలో పెట్టే దృఢ సంకల్పం, పట్టుదల, దైవానుగ్రహం అన్నీ కలిస్తే ఆరు అడుగుల రూపంలో మన ముందున్న చంద్రబాబు గారు" అని అన్నారు. ఈ బృహత్కార్యంలో చంద్రబాబుకు రాముడి వెంట హనుమంతుడిలా సహకరిస్తున్నారంటూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత ఐదేళ్ల పాలనపై అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "2014-19 మధ్య చంద్రబాబు పోలవరం పనులను 72% పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన గొడ్డలిపాటి నేతలు రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నాశనం చేశారు. ఐదేళ్లలో కనీసం 2% పనులు కూడా చేయకుండా ఆటంకాలు సృష్టించారు. ప్రాజెక్టు ఐదేళ్లు ఆలస్యం కావడం అంటే ఒక రైతు జీవితంలో ఐదేళ్ల నిరీక్షణ, ఒక ప్రాంత అభివృద్ధిలో ఐదేళ్ల వెనకడుగు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీలో "పోలవరం ఎవరి చేతిలో ప్రారంభం కావాలో రాసిపెట్టి ఉందో, ఆయనే పూర్తి చేస్తారు" అని చెప్పిన మాటలను ఆమె గుర్తుచేశారు. ఆ దైవ సంకల్పం చంద్రబాబు రూపంలో నెరవేరిందని పేర్కొన్నారు.

చంద్రబాబును 'అపర భగీరథుడు'గా అభివర్ణించిన అనిత, "పురాణాల్లో భగీరథుడు గంగ కోసం ఘోర తపస్సు చేశాడు. కానీ మనం గోదారమ్మ తల్లిని ఉత్తరాంధ్రకు తీసుకురావడానికి చంద్రబాబుకు ఒకే ఒక్క ఓటు వేశాం. ఆ ఒక్క ఓటుతోనే నాసిక్‌లో పుట్టిన గోదావరి 180 కిలోమీటర్లు ప్రయాణించి మన పొలాల దాకా వచ్చింది" అని అన్నారు. గతంలో వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న పాయకరావుపేట, నేడు ఆర్సెలర్ మిట్టల్ వంటి పరిశ్రమలతో పారిశ్రామిక, వ్యవసాయ ముఖద్వారంగా మారిందని తెలిపారు.

"ఒకే ఒక్క ఓటు గోదారమ్మను, ఆర్సెలర్ మిట్టల్‌ను, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను, పరిశ్రమలను తీసుకొచ్చింది. సరైన వ్యక్తికి సరైన సమయంలో ఓటు వేస్తే ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు, మాకు మరో వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచన కూడా రాదు. మీరే మా ముఖ్యమంత్రి, మీతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం" అని అనిత ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే రోజు ఎంతో దూరంలో లేదని, ముఖ్యమంత్రి వెంటే తామంతా నడుస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Vangalapudi Anitha
Polavaram Project
North Andhra
Godavari Water
Payakaraopeta Development

More Telugu News