వరదల వేళ భారత్‌ అండ.. నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రధాని బాలేన్‌ షా ప్రశంసలు

Balen Shah praises India for timely support during Nepal floods in Parliament
  • భారత్‌, చైనా సాయానికి బాలేన్‌ షా కృతజ్ఞతలు
  • తొలిరోజు నుంచే పరిస్థితిని అంచనా వేశారని వెల్లడి
  • మారుమూల ప్రాంతాలకు భారత నిపుణులు చేరుకున్నారని వ్యాఖ్య
  • నేపాల్‌ వరదల్లో 1,127కి చేరిన మృతుల సంఖ్య
  • 4,858 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది
నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియల విరిగిపడటంతో తీవ్ర నష్టం జరిగిన వేళ భారత్‌ అందించిన సకాల సాయంపై ఆ దేశ ప్రధాని బాలేన్‌ షా ప్రశంసలు కురిపించారు. భారత్‌, చైనా సకాలంలో సహాయక చర్యలకు మద్దతు ఇచ్చాయని నేపాల్‌ పార్లమెంట్‌లో తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అంతర్జాతీయ సాయం తిరస్కరించే ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేశారు.

వరదల ప్రభావాన్ని అంచనా వేసేందుకు భారత్‌, చైనా తమ సాంకేతిక నిపుణులను పంపాయని బాలేన్‌ షా చెప్పారు. విపత్తు సంభవించిన తొలిరోజు నుంచే నష్టాన్ని అంచనా వేసేందుకు వైమానిక పరిశీలనతో పాటు ఇతర మార్గాల్లో పరిస్థితిని పరిశీలించారని తెలిపారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే భారత సాంకేతిక నిపుణులు మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకున్నారని పేర్కొన్నారు.

వరదల ప్రాంతాల్లో బురద, మట్టి భారీగా పేరుకుపోవడంతో సహాయక చర్యలు అత్యంత కష్టంగా మారాయని బాలేన్‌ షా వివరించారు. ఎక్స్కవేటర్లు మాత్రమే కాదు.. సైన్యం, సాయుధ పోలీసు సిబ్బంది కూడా నిలబడేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

నేపాల్‌లోని భోటేకోషి నది ఉప్పొంగడంతో రసువా ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమని బాలేన్‌ షా ఇటీవల పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రపంచ స్థాయిలో సమన్వయంతో కూడిన విపత్తు నిర్వహణ వ్యవస్థ అవసరమని పిలుపునిచ్చారు.

నేపాల్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 1,127కి చేరింది. వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో సహాయక బృందాలు వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు నేపాల్‌ భద్రతా బలగాలు 6,541 మందిని ప్రభావిత ప్రాంతాల నుంచి రక్షించాయి. మరో 4,858 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

భారత్‌ భారీ స్థాయిలో మానవతా, సాంకేతిక సహాయక చర్యలు చేపట్టింది. ప్రత్యేక టన్నెల్‌ రెస్క్యూ బృందాలు, వైద్య బృందాలు, డీఎన్‌ఏ ఆధారంగా మృతులను గుర్తించే ఫోరెన్సిక్‌ నిపుణులను నేపాల్‌కు పంపింది. బాధితులను రక్షించేందుకు భారత్‌ నుంచి ఇప్పటివరకు కనీసం 163 మందిని తరలించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

అత్యవసర సహాయక సామగ్రిలో భాగంగా భారత్‌ నాలుగు విడతల్లో తాత్కాలిక షెల్టర్లు, దుప్పట్లు, హైజీన్‌ కిట్లు, సోలార్‌ లైట్లు, మందులు పంపింది. 70 టన్నులకు పైగా దుప్పట్లు, స్లీపింగ్‌ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్‌ షీట్లు, హైజీన్‌ కిట్లను విమానాల ద్వారా నేపాల్‌కు తరలించింది. బాధితుల సహాయక చర్యల కోసం భారత విదేశాంగ శాఖతో పాటు ఖాట్మండు, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌లు, హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు.
Advertisement
Balen Shah
Nepal Floods
India Nepal Relations
Disaster Relief Aid
Humanitarian Assistance
Nepal Landslides

More Telugu News