ఐఐటీ విద్యార్థులకు 100 స్కాలర్షిప్లు ఇవ్వాలని హిమంత బిశ్వ శర్మ నిర్ణయం
- ఐఐటీ గువాహటి 33వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమంత బిశ్వ శర్మ
- జీవితం అంటే పరుగుపందెం కాదని వ్యాఖ్య
- చదువుతో పాటు వ్యక్తిగత సమతుల్యతను కాపాడుకోవాలని విద్యార్థులకు సూచన
ఐఐటీ గువాహటికి చెందిన 100 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అసోం ప్రభుత్వం తరఫున ప్రత్యేక స్కాలర్షిప్లు అందించాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ గువాహటి 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఈ స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే సిద్ధం చేయాలని ఐఐటీ గువాహటి డైరెక్టర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఐఐటీ గువాహటి కేవలం విద్యా సంస్థ మాత్రమే కాదని.. అసోంతో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్లిష్టమైన సాంకేతిక, అభివృద్ధి సవాళ్లకు ఆధునిక పరిష్కారాలు కనుగొనడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే వేదికపై విద్యార్థుల మానసిక ఒత్తిడిని ఉద్దేశించి సీఎం హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. జీవితం అనేది అందరి కంటే ముందుండాలనే పరుగుపందెం కాదని, ఒకవేళ అందరికంటే వేగంగా వెళ్లలేకపోయినా ఎవరూ వెనుకబడిపోయినట్లు భావించాల్సిన అవసరం లేదని విద్యార్థులకు హితవు పలికారు. చదువుతో పాటు వ్యక్తిగత సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.