ఉత్తరాంధ్రను ముద్దాడిన గోదారమ్మ.. పాయకరావుపేట వద్ద జలహారతి పట్టిన సీఎం చంద్రబాబు

Godavari water touches North Andhra as CM Chandrababu Naidu performs Jalaharati at Payakaraopeta
  • పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు
  • పాయకరావుపేట వద్ద నీటికి సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం చంద్రబాబు
  • తొలి దశలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మందికి తాగునీరు
  • పలు నదులు, కొండలను దాటుతూ నిర్మించిన కాలువ ఒక ఇంజనీరింగ్ అద్భుతం
  • భవిష్యత్తులో 8 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమని వెల్లడి
ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకాయి. ఈ చారిత్రక ఘట్టానికి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వేదికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి, పవిత్ర జలాలను శిరస్సున చల్లుకున్నారు. అనంతరం నేలపై సాష్టాంగ ప్రమాణం ఆచరించి, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన క్షణాన తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఓ దశలో కాలువ నుంచి నీరు ప్రవహిస్తుంటే, చంద్రబాబు మెడలోని పచ్చ కండువా తీసి గాల్లో గిరగిరా తిప్పి తన ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి మిగతా నేతలు, రైతులు కూడా తమ కండువాలను గాల్లో ఊపుతూ హర్షం వెలిబుచ్చారు.

అంతకుముందు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెగ్యులేటర్‌ బటన్‌ నొక్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలోకి గోదావరి నీటిని విడుదల చేశారు. పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.

చంద్రబాబు ఓపెన్ టాపు జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ పోలవరం ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. సీఎంను స్వాగతిస్తూ వివిధ రీతుల్లో కళాకారులు స్వాగతం పలికారు. తప్పెటగుళ్లు, కోలాటం వంటి ప్రదర్శనలతో అలరించారు.

పోలవరం జలాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం. తూర్పు కనుమలను తొలిచి, ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద వంటి నదులను దాటుకుంటూ ఈ కాలువను నిర్మించారు. కొన్ని చోట్ల నదుల ప్రవాహానికి ఎగువన అక్విడెక్టులు నిర్మించగా, ఏలేరు నది గర్భం కింద నుంచి సైఫన్ ద్వారా నీటిని తరలించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేయడం ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి.

ఈ ప్రాజెక్టుతో తొలి దశలో అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
Advertisement
Chandrababu Naidu
Polavaram Left Canal
Godavari water North Andhra
Jalaharati Payakaraopeta
Uttarandhra Sujala Sravanthi
Andhra Pradesh Irrigation

More Telugu News