Advertisement

కూతురి వ్యాఖ్యల దుమారం: అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి పయనమైన కొండా సురేఖ

Konda Surekha rushes to Delhi after daughter comments spark row and high command summons
  • రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సుస్మిత
  • సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
  • ఇప్పటికే మల్లు రవికి వివరణ ఇచ్చిన కొండా సురేఖ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ అంశం ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపు మేరకు ఆమె హస్తిన బాట పట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు కూడా ఆమె అపాయింట్‌మెంట్ కోరారు.


ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిలను ఉద్దేశించి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే విమర్శలు గుప్పించడాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ... ఆ వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కమిటీ ఛైర్మన్ మల్లు రవికి ఆమె ఇప్పటికే తన వివరణను సమర్పించారు.


కొండా సురేఖ ఇచ్చిన వివరణతో పాటు, వనపర్తి వ్యవహారంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై రూపొందించిన సమగ్ర నివేదికను టీపీసీసీ నేరుగా అధిష్ఠానానికి పంపించింది. అధిష్ఠానం వద్దకు నివేదికలు చేరిన వెంటనే కొండా సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘన అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
Konda Surekha
Congress High Command
Telangana Congress
KC Venugopal
Revanth Reddy
Susmitha Konda

More Telugu News