Advertisement

సింధు జలాల వివాదం.. నీటిని ఆయుధంగా వాడొద్దన్న పాకిస్థాన్ ప్రధాని

Shehbaz Sharif says water should not be used as a political weapon in Indus Waters dispute
  • ఎస్‌సీఓ సదస్సులో సింధు జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని ప్రస్తావన
  • నీటిని రాజకీయ ఆయుధంగా వాడరాదని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్య
  • హేగ్ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించిన భారత్
  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపివేసినట్లు స్పష్టం చేసిన ఇండియా
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య సింధు జలాల ఒప్పందం వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మంగళవారం ఈ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అస్త్రంగా మలుచుకోకూడదని భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పందాలను వాటి అసలు స్ఫూర్తికి అనుగుణంగా అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

హేగ్‌లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం సింధు జలాల ఒప్పందం చెల్లుబాటును సమర్థిస్తూ, వివాద పరిష్కార యంత్రాంగం కొనసాగుతుందని తీర్పు వెలువరించిన మరుసటి రోజే షెహబాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, ఈ న్యాయస్థానం తీర్పును భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు, ఆ కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని, దాని పరిధిని తాము గుర్తించబోమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. సదరు ట్రైబ్యునల్ విచారణలో భారత్ పాల్గొనలేదని, ఆ తీర్పులు తమ జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపబోవని తేల్చిచెప్పింది.

2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. తాజా తీర్పు వెలువడినప్పటికీ, ఈ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ పునరుద్ఘాటించింది.

ఇదే ఎస్‌సీఓ సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం తగదని హెచ్చరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులు, నియామకాలు, సురక్షిత స్థావరాలను కూకటివేళ్లతో పెకిలించాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సింధు జలాల వివాదం మరోసారి కీలక అంశంగా మారింది.
Advertisement
Shehbaz Sharif
Indus Waters Treaty
SCO Summit
India Pakistan water dispute
Narendra Modi

More Telugu News