Advertisement

ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన జైష్‌ స్థావరాన్ని రూ.25 కోట్లతో పునర్నిర్మించిన పాక్‌?

Pakistan rebuilds Jaish e Mohammed headquarters destroyed in Operation Sindoor for 25 crore
  • జైష్‌ స్థావరాన్ని పాక్‌ మళ్లీ పునరుద్ధరించినట్లు సమాచారం
  • పునర్నిర్మాణానికి 250 మిలియన్ పాక్ రూపాయిల ఖర్చు
  • స్థావరంలో తక్కువ సంఖ్యలోనే క్యాడర్‌ ఉండేలా ఆదేశాలు
  • అగ్రనేతలు కొంతకాలం దూరంగా ఉండాలని సూచన
  • శిక్షణ పొందిన ఉగ్రవాదులను పీవోకేకు తరలిస్తున్న ఐఎస్‌ఐ
ఆపరేషన్‌ సిందూర్‌లో ధ్వంసమైన జైషే మహ్మద్‌ (జేఈఎం) ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్‌ మళ్లీ పునరుద్ధరించినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. బహావల్‌పూర్‌లోని ‘మర్కజ్‌ సుభానల్లా’ కేంద్రం పునర్నిర్మాణానికి పాక్‌ అధికారులు సుమారు రూ.25 కోట్ల పాకిస్థానీ కరెన్సీ (పీకేఆర్‌) కేటాయించినట్లు వెల్లడించాయి. గతేడాది మేలో ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత సాయుధ బలగాలు ఈ స్థావరంపై దాడి చేశాయి.

స్థావరంలో కార్యకలాపాలు మళ్లీ మొదలైనప్పటికీ జేఈఎం నేతలకు పాక్‌ అధికారులు పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ తక్కువ సంఖ్యలోనే సభ్యులు ఉండాలని ఆదేశించారు. జేఈఎం అగ్రనేతలు కొంతకాలం ఆ ప్రాంతానికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పునర్నిర్మాణం పూర్తయినా ఈ కేంద్రాన్ని ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించడం లేదని తెలిపారు. కొత్తగా నియామకాలు చేపట్టే వారికి సంస్థ ఉనికిని చాటేందుకే దీన్ని పునరుద్ధరించినట్లు వివరించారు. గతంలో నిర్వహించిన తరహాలో భారీ కార్యక్రమాలు ఇకపై ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జేఈఎంకు చెందిన పలువురు శిక్షణ పొందిన సభ్యులు మరణించినట్లు భారత నిఘా వర్గాలు తెలిపాయి. మౌలిక వసతులను తిరిగి నిర్మించడం సులభమే అయినా శిక్షణ పొందిన క్యాడర్‌ను భర్తీ చేయడం అంత తేలిక కాదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నియమించుకున్న వారికి యుద్ధ శిక్షణ ఇవ్వడానికి నెలలు, కొన్నిసార్లు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ వ్యూహాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. జైష్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన శిక్షణ పొందిన ఉగ్రవాదులను పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని లాంచ్‌ప్యాడ్‌లకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సులభంగా లక్ష్యంగా మారే స్థావరాల్లో వారిని ఉంచకుండా ముందుగానే తరలించాలన్నది ఐఎస్‌ఐ ఆదేశంగా పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లో జైష్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌తో కలిసి పెద్ద ఆపరేషన్‌ చేపట్టేందుకు ఐఎస్‌ఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను రక్షించడంతో పాటు భవిష్యత్తులో నియామకాలపై ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం పడకుండా చూడటమే ఈ వ్యూహం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు.
Advertisement
Jaish e Mohammed
Operation Sindoor
Markaz Subhanallah
Bahawalpur
ISI Pakistan
Pakistan terrorism infrastructure

More Telugu News