2016లో మెస్సీ తొలిసారి అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఏమన్నారంటే!
- 2016 కోపా అమెరికా ఫైనల్లో ఓటమిపాలైన అర్జెంటీనా
- తీవ్ర నిరాశతో తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ
- అర్జెంటీనా జట్టుకు మెస్సీ అవసరం ఉందన్న రొనాల్డో
2016 కోపా అమెరికా ఫైనల్లో చిలీ చేతిలో అర్జెంటీనా ఓటమిపాలయ్యాక, తీవ్ర నిరాశకు గురైన లియోనెల్ మెస్సీ తొలిసారి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
అప్పట్లో మెస్సీ నిర్ణయంపై ఆయన చిరకాల ప్రత్యర్థి, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో స్పందిస్తూ ఎంతో సానుభూతిని, గౌరవాన్ని వ్యక్తంచేశారు. "మెస్సీ కన్నీళ్లు పెట్టుకోవడం నన్ను ఎంతగానో కలచివేసింది" అని రొనాల్డో వ్యాఖ్యానించారు. "మెస్సీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అభిమానులు దానిని అర్థం చేసుకుని గౌరవించాలి. ఆయన ఎప్పుడూ ఓటములను లేదా రెండో స్థానంలో నిలవడాన్ని అలవాటు చేసుకోలేదు. పెనాల్టీ మిస్ అయినంత మాత్రాన ఎవరూ చెడు ఆటగాడు అయిపోరు. మెస్సీ మళ్లీ అర్జెంటీనా జాతీయ జట్టులోకి తిరిగిరావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ జట్టుకు ఆయన అవసరం ఎంతైనా ఉంది" అని రొనాల్డో స్పష్టం చేశారు.
ఆ తర్వాత అర్జెంటీనా అభిమానుల విజ్ఞప్తులు, దేశ అధ్యక్షుడి కోరిక మేరకు మెస్సీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, 2021 కోపా అమెరికా, 2022 ఫిఫా ప్రపంచ కప్ విజేతగా అర్జెంటీనాను నిలబెట్టిన సంగతి తెలిసిందే.