ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఫిదా
- విధి నిర్వహణలో ఉన్న జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు, విద్యార్థినులు
- సరిహద్దులను కాపాడుతున్న జవాన్లకు మిఠాయిలు తినిపించిన వైనం
- ఆత్మీయానురాగానికి భావోద్వేగానికి గురైన సైనికులు
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని జమ్మూకశ్మీర్లోని స్థానిక కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న భారత సైనిక జవాన్లకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దులను కాపాడుతున్న జవాన్లకు రాఖీలు కట్టి, వారికి మిఠాయిలు తినిపించారు.
కశ్మీరీ సోదరీమణులు చూపించిన ఈ ఆత్మీయానురాగానికి సైనికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సరిహద్దుల్లో తమ రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న సైనికులకు కృతజ్ఞతగా కశ్మీరీ ఆడబిడ్డలు ఈ వేడుకను నిర్వహించగా... ప్రతిగా జవాన్లు కూడా వారికి ఎల్లవేళలా రక్షణగా ఉంటామని మాట ఇచ్చారు. దీనికి సంబంధించిన హృదయానికి హత్తుకునే వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా, నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.