గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు
- మంగళగిరిలోని అరణ్యభవన్ లో బాధ్యతలు స్వీకరించిన నాగబాబు
- కేబినెట్ హోదాతో గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ పదవి
- బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు అర్ధాంగి పద్మజ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా ప్రముఖ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తన భార్య పద్మజతో కలిసి పాల్గొన్న ఆయన... వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.
రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ‘ఏపీ గ్రీన్’ ప్రాజెక్టును ముందుకు నడిపేందుకు నాగబాబుకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, పచ్చదనం శాతాన్ని ఏకంగా 50 శాతానికి పెంచాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను వేగవంతం చేసేందుకు గాను నాగబాబుకు కేబినెట్ హోదా హోదాతో కూడిన బాధ్యతలను అప్పగించింది.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబును పలువురు ఐఏఎస్ అధికారులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీఎఫ్ చలపతిరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజలతో పాటు ఇతర ప్రభుత్వ సలహాదారులు, ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.