పల్నాడు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి
- చిలకలూరిపేట వద్ద ఆటోను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
- ఏడుగురు అక్కడికక్కడే మృతి
- ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం తీరని శోకాన్ని మిగిల్చిందన్న జగన్
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆటోను బలంగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయవిదారకమని ఆయన అన్నారు.
మృతులందరూ చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం తీరని శోకాన్ని మిగిల్చిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని అన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, శోకతప్త కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.