క్రేన్‌పైకి ఎక్కి పనులను చూసిన సీఎం రేవంత్ రెడ్డి

  • మీరాలం చెరువు అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించిన సీఎం రేవంత్
  • సస్పెన్షన్ బ్రిడ్జి పనులను క్రేన్‌పై నుంచి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి
  • గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
  • వాటర్ స్పోర్ట్స్‌, ఐల్యాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచన
హైదరాబాద్‌లోని మీరాలం చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. పనుల తీరును పరిశీలించేందుకు భారీ క్రేన్‌పైకి ఎక్కి మరీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం గమనార్హం.

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. చెరువులోకి ఎలాంటి పరిస్థితుల్లోనూ మురుగునీరు వచ్చి చేరకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మీరాలం నుంచి మూసీలోకి వరద నీరు సులభంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని కూడా సూచించారు.

చెరువులో ఉన్న ఐల్యాండ్‌ను అభివృద్ధి చేయాలని, వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు వీలుగా డిజైన్ రూపొందించాలని తెలిపారు. మొత్తంమీద మీరాలం చెరువును ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement

More Telugu News