కష్టకాలంలో అండగా నిలిచారు: చంద్రబాబు అరెస్టును గుర్తు చేసుకుని బళ్ళారిలో లోకేశ్ భావోద్వేగం

Nara Lokesh gets emotional in Ballari recalling Chandrababu Naidu arrest support
  • బళ్ళారిలో మంత్రి నారా లోకేశ్ కు ఘన స్వాగతం
  • కష్టకాలంలో అండగా నిలిచారంటూ బళ్ళారి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
  • ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంక్షేమమే టీడీపీ ధ్యేయం అని స్పష్టీకరణ
  • ఏపీ, కర్ణాటక కలిసి పనిచేసి దక్షిణ భారత్‌ను అభివృద్ధి చేయాలని పిలుపు
  • అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ సర్కిల్ ఏర్పాటుపై స్థానిక తెలుగు ప్రజలకు అభినందనలు
చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సమయంలో బళ్ళారి తెలుగు ప్రజలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన బళ్ళారి తెలుగు వారి రుణం తీర్చుకుంటానని ఆయన ఉద్ఘాటించారు. బళ్ళారి జిల్లా కుడితినిలో పర్యటించిన లోకేశ్ కు స్థానిక తెలుగు ప్రజలు, యువత, టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. భారీ గజమాలతో ఆయనను సత్కరించి, బాణసంచా కాలుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బళ్లారిలో తెలుగు ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన సమయంలో తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "ఆ క్లిష్ట పరిస్థితుల్లో బళ్ళారి గడ్డపై మీరు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో నూతనోత్తేజాన్ని నింపాయి. ఆ పోరాట స్ఫూర్తిని ఎప్పటికీ మరువలేను, జీవితాంతం మీకు అండగా నిలుస్తాను" అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సంక్షేమమే ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, గతంలో ఉత్తరాఖండ్ విపత్తులో చిక్కుకున్న వారిని చంద్రబాబు స్వయంగా చొరవ తీసుకుని కాపాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటూ దక్షిణ భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

గతంలో చంద్రబాబు, ఎస్.ఎం. కృష్ణల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీతత్వమే హైదరాబాద్, బెంగళూరు నగరాల శరవేగ అభివృద్ధికి మూలకారణమైందని ఆయన అన్నారు. ఇటీవలి ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాల మధ్య సహకారం, నదుల అనుసంధానం ఆవశ్యకతపై చర్చించారని తెలిపారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు.

బళ్ళారిలో తెలుగు ప్రజలు తమ సొంత నిధులతో 'అన్న క్యాంటీన్' నిర్వహించడం, ఎన్టీఆర్ సర్కిల్ కోసం జీవో సాధించడం పట్ల లోకేశ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలోనే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బళ్ళారి తెలుగు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారని, వారంతా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, స్థానిక టీడీపీ నాయకులు రాము, అనూప్ కుమార్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Chandrababu Naidu Arrest
Ballari Telugu People
Telugu Desam Party
Andhra Pradesh Development

More Telugu News