ధర్మపురి అర్వింద్ పై పోలీసు నిఘా పెట్టలేదు: తెలంగాణ డీజీపీ
- రేవంత్ సోదరుడి ఆదేశాలతో తనపై పోలీసు నిఘా పెట్టారన్న ధర్మపురి అర్వింద్
- సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాలతో పోలీసు శాఖ పనిచేస్తోందా? అని ప్రశ్న
- అర్వింద్ పై నిఘా కోసం ఏ అధికారిని కూడా నియమించలేదన్న డీజీపీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాల మేరకు తనపై పోలీసు నిఘా ఉంచారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన సంచలన ఆరోపణలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తోసిపుచ్చారు.
రేవంత్ సోదరుడి సూచనల మేరకు తన కదలికలపై నిఘా ఉంచేందుకు ఒక ఏసీపీ స్థాయి పోలీసు అధికారిని నియమించారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ వేదికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను ఉద్దేశించి సంచలన పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసు యంత్రాంగం భారత రాజ్యాంగానికి, చట్టబద్ధమైన అధికార పరిధికి కట్టుబడి పనిచేస్తోందా లేక సీఎం కుటుంబ సభ్యుల ఆదేశాలతో నడుస్తోందా అని ఆయన తన ట్వీట్లో ప్రశ్నించారు.
ఎంపీ పోస్టుపై వెంటనే స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్, సంబంధిత అధికారులతో సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ధ్రువీకరించుకున్నామని తెలిపారు. ఎంపీని అనుసరించడానికి గానీ, ఆయనపై నిఘా ఉంచడానికి గానీ ఏ అధికారిని నియమించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖ ఇటువంటి నిఘా పద్ధతులను ఎన్నడూ అనుసరించదని, కేవలం రాజ్యాంగబద్ధమైన విధులకు మాత్రమే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
అయినప్పటికీ, ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ వద్ద ఏవైనా నిర్దిష్టమైన ఆధారాలు లేదా సమాచారం ఉంటే నేరుగా తనకు వ్యక్తిగతంగా అందజేయవచ్చని, వాటి ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. డీజీపీ ఇచ్చిన ఈ వివరణతో ఎంపీ వర్సెస్ పోలీసు నిఘా వివాదంలో చెలరేగిన రాజకీయ దుమారానికి తెరదించే ప్రయత్నం చేశారు.