వైరల్‌ వీడియోతో వెలుగులోకి అరుదైన జీవి.. ‘గంగైఇక్తిస్‌ ఇండోనేపాలికస్‌’గా నామకరణం

Gangaichthys indonepalicus rare creature discovered through viral video
  • భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ బోరుబావి నుంచి బయటపడ్డ జీవి
  • శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించిన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో
  • గంగానది పేరుతో దీనికి ‘గంగైఇక్తిస్‌’ అనే పేరు
  • ‘చౌధురిడే’ కుటుంబానికి చెందిన కొత్త జాతిగా గుర్తింపు
  • జూకీస్‌ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాలు
సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియో శాస్త్రవేత్తలను ఓ అరుదైన చేప జాతి ఆచూకీ వైపు నడిపించింది. సాధారణంగా చేపలకు ఉండే లక్షణాలకు పూర్తిగా భిన్నంగా, అచ్చం వానపాములా కనిపించిన ఓ చిన్న జీవి భారత్‌-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ బోరుబావి నుంచి బయటకు వచ్చింది. 2024లో సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో శాస్త్రవేత్తల దృష్టి దానిపై పడింది. పూర్తిగా చీకటిగా ఉండే భూగర్భ జలాల్లో ఈ జీవి బయటపడటంతో ఇది ఇంతవరకు గుర్తించని కొత్త జాతి కావచ్చని పరిశోధకులు అనుమానించారు.

ఈ వింత చేపకు శాస్త్రవేత్తలు ‘గంగైఇక్తిస్‌ ఇండోనేపాలికస్‌’ (Gangaichthys indonepalicus) అనే పేరు పెట్టారు. గంగానది పేరుతో దీనికి ‘గంగైఇక్తిస్‌’ అనే పేరు పెట్టినట్లు పరిశోధకులు తెలిపారు. దాదాపు నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉండే ఈ చేపకు కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. భూగర్భంలో ఎలాంటి వెలుతురు లేకపోవడంతో చూపు అవసరం లేకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ చేపకు పెద్ద రెక్కలు లేవు. నీటితో నిండిన మట్టి పొరలు, భూగర్భంలోని తడి ప్రాంతాల్లో వానపాములా శరీరాన్ని మెలితిప్పుకుంటూ కదులుతుంది. బయటకు చూస్తే వానపాములా కనిపించినప్పటికీ, మైక్రో-సీటీ స్కానింగ్‌, జన్యు విశ్లేషణల ద్వారా ఇది పూర్తిగా భిన్నమైన చేప జాతి అని పరిశోధకులు నిర్ధారించారు. ఇది ‘చౌధురిడే’ (Chaudhuriidae) కుటుంబానికి చెందిన కొత్త జాతిగా గుర్తించారు.

ఈ అరుదైన చేపను పట్టుకోవడం మాత్రం పరిశోధకులు చాలా శ్రమించారు. బోరుబావులను గుర్తించి వాటి యజమానుల అనుమతి తీసుకొని పరిశోధకులు నీటిని చేతులతో బయటకు తోడారు. సుమారు 2,000 లీటర్ల నీటిని బయటకు తీసిన తర్వాత మొదటి చేప కనిపించింది. అయితే అది గాయపడి వెంటనే చనిపోయింది. మరో 500 లీటర్ల నీటిని తోడిన తర్వాత రెండో చేప లభించింది. అదే పూర్తి స్థితిలో లభించిన నమూనా కావడంతో దానిని ఈ కొత్త జాతికి ‘హోలోటైప్‌’గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ముంబైకి చెందిన ఠాక్రే వైల్డ్‌లైఫ్‌ ఫౌండేషన్‌, కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ, చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన షాంఘై సింక్రోట్రాన్‌ రేడియేషన్‌ ఫెసిలిటీ, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధన వివరాలు ‘జూకీస్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇండో-గంగా మైదానాల్లో, గంగానది పరివాహక ప్రాంతంలో గుర్తించిన తొలి భూగర్భ జల చేపగా దీన్ని పరిశోధకులు పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో సాధారణంగా కనిపించిన ఓ వీడియో చివరకు శాస్త్రవేత్తలను భూమి లోపల దాగి ఉన్న అరుదైన జీవ వైవిధ్యాన్ని కనుగొనేలా చేసింది. కోట్లాది మంది జీవనానికి నీరు, ఆహారం, ఉపాధిని అందించే గంగానది పరివాహక ప్రాంతంలో ఇలాంటి వింత జీవి బయటపడటం శాస్త్రవేత్తలకు ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచ శాస్త్రీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
Advertisement
Gangaichthys indonepalicus
New fish species discovery
India Nepal border rare fish
Underground fish species Ganga
Viral video fish discovery
Chaudhuriidae family fish

More Telugu News