వందేమాతరం వివాదం.. కాంగ్రెస్ పై కంగనా రనౌత్‌ తీవ్ర విమర్శలు

Vande Mataram controversy Kangana Ranaut slams Sonia Gandhi
  • కాంగ్రెస్‌ దేశానికి వ్యతిరేకంగా మారుతోందని ఆరోపణ
  • గేయాన్ని ఆపాలని సోనియా సూచించినట్లు ప్రచారం
  • గేయాన్ని ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్య
‘వందేమాతరం’ పూర్తి గేయం ఆలాపనపై నెలకొన్న వివాదం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ అంశంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీకి మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని.. దేశానికి కూడా వ్యతిరేకంగా మారుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.

ఆగస్టు 15న ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వందేమాతరం ఆలాపన ప్రారంభమైంది. అయితే పార్టీ నిర్ణయం ప్రకారం తొలి రెండు చరణాలకే పరిమితం కావాల్సిన గీతాన్ని గాయకులు పూర్తిగా ఆలపించినట్లు సమాచారం.

పూర్తి గేయం ఆలాపనను సోనియా గాంధీ గమనించినట్లు సమాచారం. ఆమె ఖర్గే వైపు సైగ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గాయకులను ఆపాలని సూచించినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన కంగనా.. వందేమాతరం భారతదేశ చైతన్యానికి ప్రతీక అని అన్నారు. కళాకారిణిగా కళ, కవిత్వం ప్రజలపై చూపే ప్రభావం తనకు తెలుసని చెప్పారు. అలాంటి గేయాన్ని ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ వైఖరిపై కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించడం దాటి దేశానికి వ్యతిరేకంగా మారుతోందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బీజేపీ తన బృందాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. యువతపై సోషల్‌ మీడియా, రీల్స్‌ ప్రభావం పెరిగిందని.. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ దారిలో పనిచేస్తామని పేర్కొన్నారు.
Advertisement
Kangana Ranaut
Sonia Gandhi
Vande Mataram Controversy
Congress Party
Mallikarjun Kharge
Independence Day 2024

More Telugu News