ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ప్రతిపాదన తిరస్కరణ.. ఉరి ద్వారానే మరణశిక్ష అమలు కొనసాగింపు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ఉరి శిక్షకు బదులుగా తక్కువ బాధ కలిగించే పద్ధతులను అమలు చేయాలంటూ పిటిషన్
- ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించే పద్ధతే చెల్లుబాటు అవుతుందన్న సుప్రీంకోర్టు
- ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య
మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరిశిక్ష వేసే పద్ధతిని రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా తక్కువ బాధ కలిగించే పద్ధతులను (విషపు ఇంజెక్షన్, కాల్చిచంపడం వంటివి) అమలు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన పిటిషన్ను అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 354(5) CrPC / BNSS 393(5) ప్రకారం ఉరి తీయడం ద్వారా మరణశిక్ష విధించే పద్ధతి చెల్లుబాటు అవుతుందని, గతంలో 3-జడ్జిల బెంచ్ (దీనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు) ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించడానికి పెద్ద బెంచ్కు పంపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అయితే, ఈ తీర్పు అంతిమం కాదని, భవిష్యత్తులో శాస్త్రీయ లేదా వైద్యపరమైన ఆధారాలు వచ్చి ప్రత్యామ్నాయ పద్ధతులు మెరుగైనవి అని రుజువైతే ఈ అంశాన్ని మళ్లీ రాజ్యాంగబద్ధంగా సమీక్షించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అలాగే, ఉరిశిక్ష కంటే తక్కువ వేదన కలిగించే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.