హఫీజ్ సయీద్‌కు నేను బానిస.. అంటూనే భారత్‌కు పాకిస్థాన్ మాజీ మంత్రి బెదిరింపులు

Sheikh Rashid Ahmed calls himself a slave of Hafiz Saeed and threatens India
  • ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు తాను బానిసనన్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్
  • లష్కరే తోయిబా నేతలతో కలిసి వేదిక పంచుకున్న రషీద్
  • పాకిస్థాన్ వైపు చూస్తే భారత్‌లో పక్షులు కూడా కూయవంటూ హెచ్చరిక
  • రషీద్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్.. విమర్శల వెల్లువ
పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు తాను 'గులాం'ను (బానిసను) అని ఆయన బహిరంగంగా ప్రకటించారు. లష్కరే తోయిబా కీలక నేతలతో వేదికను పంచుకుంటూనే, భారత్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒక బహిరంగ సభలో ప్రసంగించిన షేక్ రషీద్, "నేను హఫీజ్ సాహెబ్‌కు బానిసను" అని వ్యాఖ్యానించారు. తన మొబైల్ ఫోన్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ ఉన్నందునే అమెరికా తనపై నిషేధం విధించిందని ఆయన పేర్కొన్నారు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, సలహా కమిటీ సభ్యుడు కారీ మహ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి ఆయన వేదికపై కనిపించడం గమనార్హం.

ఇదే సభలో భారత్‌ను ఉద్దేశించి రషీద్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. "భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే సర్వనాశనమవుతుంది. ఆ తర్వాత భారత్‌లో ఏ పక్షీ కూయదు, ఏ గుడిలోనూ గంట మోగదు" అంటూ రెచ్చగొట్టేలా హెచ్చరించారు. పాకిస్థాన్‌‌తో పాటు హఫీజ్ సయీద్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

షేక్ రషీద్ 2020 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన ఒక మాజీ మంత్రి, ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదికి బహిరంగంగా మద్దతు పలకడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఉదంతం పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Sheikh Rashid Ahmed
Hafiz Saeed
Pakistan India relations
Lashkar e Taiba
Terrorism support

More Telugu News