ఏనుగులు జీవవైవిధ్యానికి కాపలాదారులు.. వాటి సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan says elephants are biodiversity guardians and conservation must become a people movement
  • ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పాల్గొన్న పవన్ కల్యాణ్
  • దేశంలో ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కి పెరిగిందన్న డిప్యూటీ సీఎం
  • మానవ-ఏనుగుల సంఘర్షణను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని వెల్లడి

ఏనుగులు కేవలం అడవులకే పరిమితం కాకుండా జీవవైవిధ్యానికి కాపలాదారులుగా, దేశ సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వన్యప్రాణుల సంరక్షణ, మానవ-ఏనుగుల సంఘర్షణ నివారణపై కీలక వ్యాఖ్యలు చేశారు.


ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల, 2014 నుంచి ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందని, అలాగే 150 ఏనుగుల కారిడార్లను గుర్తించి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 132 నుంచి 142 వరకు అడవి ఏనుగులు ఉన్నాయని వెల్లడించారు. 


పలమనేరు, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారిన మానవ-ఏనుగుల సంఘర్షణను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా కర్ణాటక నుంచి నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ముసలివాగు వద్ద ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వీటి సహాయంతో 50కి పైగా ఆపరేషన్లు నిర్వహించి మానవ మరణాలను 70 శాతం వరకు తగ్గించగలిగామని స్పష్టం చేశారు.


అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హనుమాన్’ కార్యక్రమంలో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలతో పాటు ఏడు ప్రత్యేక వన్యప్రాణుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వీటి ద్వారా ఇప్పటివరకు 200కు పైగా వన్యప్రాణులను రక్షించడంతో పాటు 30కి పైగా ప్రత్యేక ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏనుగుల సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Advertisement
Pawan Kalyan
World Elephant Day
Andhra Pradesh
Wildlife Conservation
Human Elephant Conflict
Hanuman Program

More Telugu News