250 రోజులుగా సముద్రంలోనే.. అమెరికా యుద్ధనౌకలో ఏం జరుగుతోంది?

USS Abraham Lincoln 250 days at sea what is happening on the US aircraft carrier
  • 9 నెలలుగా సముద్రంలోనే యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ నౌక 
  • 250 రోజులు తీరానికి దూరంగా ఉన్న నౌకలోని సిబ్బంది
  • నావికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్లు కుటుంబాల ఆవేదన
  • సుదీర్ఘ మోహరింపుతో తీవ్ర మానసిక ఒత్తిడిలో సిబ్బంది 
  • నీరు, ఆహారం, పారిశుద్ధ్యంపైనా కుటుంబాలు ఫిర్యాదు
ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా సముద్రంలోనే ఉన్న నౌకలో పలువురు నావికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొందరు నౌక నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించగా తోటి సిబ్బంది అడ్డుకున్నట్లు ‘మిలిటరీ టైమ్స్‌’ కథనం తెలిపింది.

సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు ఉన్న ఈ యుద్ధనౌక వరుసగా 250 రోజులుగా తీరానికి చేరలేదు. సుదీర్ఘ మోహరింపు, పదేపదే పొడిగింపులు సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

శాన్‌ డియాగోలో నిర్వహించిన సమావేశంలో దాదాపు 200 మంది కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారులను నిలదీశారు. ఓ మహిళ తన భర్త అదే రోజు తనకు సందేశం పంపాడని చెప్పారు. ‘‘రేపు నిద్ర లేవకపోతే బాగుంటుందని’’ అతడు చెప్పినట్లు తెలిపారు. నేవీ నాయకత్వంపై తమ నమ్మకం దెబ్బతిన్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త నౌక నుంచి దూకేందుకు ప్రయత్నించాడని మరో నావికుడి భార్య  తెలిపింది. సుదీర్ఘ మోహరింపుతో తీవ్రంగా అలసిపోయిన అతడు భవిష్యత్తుపై భయపడుతున్నట్లు చెప్పారు. మరో ఘటనలో నౌక నుంచి దూకేందుకు ప్రయత్నించిన సహచరుడిని ఓ నావికుడు పట్టుకుని వెనక్కి లాగినట్లు సమాచారం.

అబ్రహం లింకన్‌ గత నవంబర్‌ 21న శాన్‌ డియాగో నుంచి బయలుదేరింది. తొలుత పసిఫిక్‌ ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యానికి మళ్లించారు. అప్పటి నుంచి సిబ్బందికి తీరంలో గడిపే అవకాశం చాలా తక్కువగా లభించింది. డిసెంబరులో గువామ్‌లో, జులైలో ఒమన్‌లో కలిపి రెండు రోజులు మాత్రమే నేలపై గడిపినట్లు సమాచారం.

మే నెలలో మోహరింపు ముగియాల్సి ఉంది. యుద్ధం కొనసాగడంతో పలుమార్లు పొడిగించారు. ప్రస్తుతం నౌక ఇరాన్‌పై యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటోంది.

సిబ్బంది నివాస పరిస్థితులపైనా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. బూజు పట్టిన షవర్లు, పనిచేయని మరుగుదొడ్లు, వారాల తరబడి పనిచేయని లాండ్రీ యంత్రాలు, వేడి నీటి కొరత ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సబ్బు, డియోడరెంట్‌, టూత్‌పేస్ట్‌ కూడా అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. ఆహారం పరిమితంగా ఉంటోందని కూడా ఫిర్యాదులు వచ్చాయి.

కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యుడు మైక్‌ లెవిన్‌ ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. సైనికులకు కనీసం వేడి నీరు, పనిచేసే మరుగుదొడ్డి, తగిన ఆహారం అందించాల్సిన బాధ్యత నేవీపై ఉందని అన్నారు.
Advertisement
USS Abraham Lincoln
US Navy sailors
Middle East deployment
Mental health crisis
Iran conflict
Military Times report

More Telugu News