ఉగ్రవాదులతో వేదికపై పాక్ మాజీ మంత్రి... భారత్‌‌ను సర్వనాశనం చేస్తామని హెచ్చరిక

Sheikh Rashid Ahmed shares stage with terrorists and warns to destroy India
  • లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి షేక్ రషీద్
  • ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు తాను బానిసనని వ్యాఖ్య
  • భారత్‌లో గుళ్లలో గంటలు కూడా మోగవంటూ తీవ్ర వ్యాఖ్యలు
  • ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన రషీద్
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా, భారత్‌పై తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.

ఈ వీడియోలో, లష్కరే సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి రషీద్ వేదికపై కనిపించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ "నేను హఫీజ్ సాహెబ్‌కు బానిసను (గులాంను)" అని రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము పాకిస్థాన్‌తో ఉన్నాం, హఫీజ్ సయీద్‌తో ఉన్నాం" అని బహిరంగంగా ప్రకటించారు.

అంతటితో ఆగకుండా భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "భారత్ గనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే అల్లానే ఆ దేశాన్ని నాశనం చేస్తాడు" అని హెచ్చరించారు. "భారత్‌లో పక్షులు కూడా కూయవు, గుళ్లలో గంటలు కూడా మోగవు" అంటూ విషం కక్కారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు తన ఫోన్‌లో హఫీజ్ సయీద్ నంబర్ కనిపించిందని, ఆ కారణంతోనే తనను ఆ దేశం నుంచి బహిష్కరించారని కూడా రషీద్ చెప్పుకొచ్చారు.

షేక్ రషీద్ అహ్మద్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో దేశ అంతర్గత భద్రతకు బాధ్యత వహించిన వ్యక్తే ఇప్పుడు బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు పలకడం, భారత్‌ను బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Sheikh Rashid Ahmed
Hafiz Saeed
Lashkar e Taiba
Pakistan former minister
Anti India threats
India Pakistan relations

More Telugu News