టీమిండియా వైఫల్యాలు.. గంభీర్ కోచింగ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

BCCI key decision on Gautam Gambhir coaching after Team India failures
  • కోచ్‌గా గౌతమ్ గంభీర్‌పై వేటుకు బీసీసీఐ విముఖత
  • జట్టు పరివర్తన దశలో ఉందని, గాయాలు వెంటాడుతున్నాయని బీసీసీఐ భావన
  • తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించే ఆలోచన లేదని స్పష్టీక‌ర‌ణ‌
  • పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 2027 ప్రపంచకప్ వరకు గంభీర్ కొనసాగే అవకాశం
  • విమర్శలు వస్తున్నప్పటికీ గంభీర్‌కే మద్దతు ఇస్తున్న బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పదవికి వచ్చిన ముప్పేమీ లేదని, అత‌డు ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జట్టు వైఫల్యాలు, అంతకుముందు స్వదేశంలో టెస్టు సిరీస్‌లలో ఎదురైన పరాజయాలతో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ బీసీసీఐ గౌతీకి అండగా నిలుస్తున్నట్లు సమాచారం. గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

గతంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లలో టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది. దీనికి తోడు ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడం భారత్‌కు కష్టతరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో గంభీర్‌ను తొలగించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే, బోర్డు వర్గాలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

టెస్టు జట్టు ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉందని బీసీసీఐ భావించడమే ఇందుకు మొదటి కారణం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో యువ జట్టు నిర్మితమవుతోంది. ఈ మార్పులకు కొంత సమయం పడుతుందని బోర్డు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక రెండో కారణంగా.. కీలక ఆటగాళ్ల గాయాల సమస్యను కూడా బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ మధ్యలో గిల్ గాయపడకుండా ఉండుంటే ఫలితం మరోలా ఉండేదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు కూడా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమయ్యారు.

మరోవైపు, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ తన పాత్రలో సంతృప్తిగా ఉన్నాడు. శ్రీలంక పర్యటన తర్వాత డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో కేవలం రెండు సిరీస్‌లే మిగిలి ఉండటంతో తాత్కాలిక కోచ్ నియామకంపై బోర్డు ఆసక్తి చూపడం లేదు. ఈ కారణాల రీత్యా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ హెడ్ కోచ్‌గా కొనసాగడం దాదాపు ఖాయమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Advertisement
Gautam Gambhir
BCCI
Team India
Indian Cricket Coach
World Test Championship
Indian Cricket Team

More Telugu News