స్కూల్కు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన ఉపాధ్యాయురాలు
- కర్లపాద గ్రామంలో భయానక ఘటన
- వాగును దాటుతున్న సమయంలో పెరిగిన వరద
- చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న ఉపాధ్యాయురాలు
విధి నిర్వహణ కోసం బయలుదేరిన ఒక ఉపాధ్యాయురాలిని ఆకస్మికంగా వచ్చిన వరద ఉద్ధృతి ముంచెత్తింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కర్లపొద గ్రామం వద్ద ఈ భయంకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులను నిర్వర్తిస్తున్న ఎం.మణి ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు బయలుదేరగా, మార్గమధ్యంలో ఉన్న వాగును దాటే క్రమంలో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
భారీ ప్రవాహంలో కొంతదూరం కొట్టుకుపోయిన ఆమె, ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తూ బిగ్గరగా కేకలు వేశారు. ఆ కేకలు విన్న గ్రామస్థులు తక్షణమే స్పందించి, ప్రాణాలకు తెగించి ఆమె వద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు, గ్రామస్థులు తెలిపారు. ఏటా వర్షాకాలంలో ఈ వాగు పొంగిపొర్లుతూ ప్రాణాలమీదికి తెస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.