నేతాజీ అస్థికల తరలింపు.. కుమార్తె పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Subhash Chandra Bose remains Supreme Court issues notice to Center on daughter Anita Bose petition
  • నేతాజీ అస్థికలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలని పిటిషన్
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేతాజీ కుమార్తె అనితా బోస్ పఫ్
  • పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
  • గతంలో ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం
  • వారసులే నేరుగా కోర్టును ఆశ్రయించాలని గతంలో స్పష్టం చేసిన సుప్రీం
స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భౌతిక అవశేషాలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె అనితా బోస్ పఫ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ, హోం మంత్రిత్వ శాఖలకు నేడు నోటీసులు జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. నేతాజీ కుమార్తె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 28వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. దశాబ్దాలుగా జపాన్‌ రాజ‌ధాని టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని పిటిషన్‌లో కోరారు. నేతాజీ కుమార్తెగా, చట్టబద్ధమైన వారసురాలిగా తనకు ఈ అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించే హక్కు ఉందని అనితా బోస్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొన్ని నెలల క్రితం ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నేతాజీ సోదరుడి మనవడు ఆశిష్ రే దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనమే విచారించడానికి నిరాకరించింది. ఆ సమయంలో పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, నేతాజీ కుమార్తె నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని తెలిపారు.

ఆనాటి విచారణలో నేతాజీకి ఏకైక చట్టబద్ధమైన వారసురాలు అనితా బోస్ అని, ఆమె కూడా అస్థికలను వెనక్కి తీసుకురావాలనే కోరుకుంటున్నారని సింఘ్వీ వాదించారు. అయితే, "వారసురాలు పిటిషనర్‌గా లేరు. వారే స్వయంగా మా ముందుకు రావాలి. తెర వెనుక ఉండి పోరాటం చేయలేరు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. నేతాజీ కుటుంబ సభ్యుల భావోద్వేగాలను గౌరవిస్తామని, అయితే చట్టపరమైన ప్రక్రియను సంబంధిత వారసులే ప్రారంభించాలని అప్పుడు సూచించింది. 

కోర్టు సూచనల మేరకే తాజాగా అనితా బోస్ పిటిషన్ దాఖలు చేయడంతో ధర్మాసనం విచారణకు స్వీకరించి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తన తండ్రికి దేశంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా అస్థికలను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు.
Advertisement
Subhash Chandra Bose
Anita Bose Pfaff
Supreme Court of India
Netaji ashes Japan
Renkoji Temple Tokyo
Central Government notice

More Telugu News