ఆక్వా రంగానికి ‘పవర్’ ఊరట: పాలకొల్లు సభలో జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు
- ఆక్వారంగానికి రూ. 1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీ జీవోను విడుదల చేసిన అచ్చెన్న
- ఆక్వారంగం చంద్రబాబు మానసపుత్రిక అని వ్యాఖ్య
- జగన్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు వెంటిలేటర్పై పడేసిన వాళ్లకు, తాడేపల్లి ప్యాలెస్ దాటని మాజీ సీఎం జగన్కు ఆక్వా రైతుల కష్టాల గురించి మాట్లాడే హక్కే లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గొడ్డలి పార్టీతో ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తుకే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూ రూ.1,150 కోట్ల విద్యుత్ సబ్సిడీకి సంబంధించిన జీవోను మంత్రి విడుదల చేశారు.
పాలకొల్లులో ఆక్వా రైతులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజులతో కలిసి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆక్వారంగం అనేది సీఎం చంద్రబాబు నాయుడి మానసపుత్రిక అని అభివర్ణించిన ఆయన, ఐదు కోట్ల ఆంధ్రులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్లనే చంద్రబాబు వంటి దార్శనిక నేత దక్కారని కొనియాడారు. 2019లో ప్రజలు ఆవేశపడి దోపిడీదారులకు అధికారం కట్టబెట్టడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఐదేళ్లపాటు తీవ్ర ఐసీయూ స్థితిలోకి వెళ్లిందని, నాటి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు జగన్ ప్రతి చిన్న విషయాన్నీ సమస్యగా చిత్రీకరించే చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎంతటి నిధుల కొరత ఉన్నప్పటికీ ఆక్వా రైతులను ఆదుకోవాలనే ఏకైక సంకల్పంతో ఈ భారీ విద్యుత్ సబ్సిడీని సకాలంలో విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీతో పాటు, చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాలను సైతం ఈ 26 నెలల స్వల్ప వ్యవధిలోనే నెరవేర్చామని గర్వంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సాయంతో ఏపీ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని, రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మారుస్తూ ‘బ్లూ ఎకానమీ’ దిశగా ఆంధ్రప్రదేశ్ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నామని చెప్పారు.