సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR sensational allegations against CM Revanth Reddy brothers
  • సీఎం సోదరులు షెల్ కంపెనీలతో లబ్ధి పొందుతున్నారని కేటీఆర్ ఆరోపణ
  • టెసరాక్ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమి కేటాయించారని విమర్శ
  • కేవలం లక్ష రూపాయల మూలధనంతో కంపెనీ ఏర్పాటు చేశారని వెల్లడి
  • రేవంత్ సోదరులకు షెల్ కంపెనీలు.. భారీగా లబ్ధి: కేటీఆర్ సంచలన ఆరోపణలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు నామమాత్రపు అర్హతలతో భారీ కంపెనీలను రిజిస్టర్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి సోదరులు బడా కంపెనీలకు యజమానులుగా మారుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీలను చిన్న నివాసాల చిరునామాలతో రిజిస్టర్ చేయించారని పేర్కొన్నారు. అటువంటి ఒక కంపెనీకే దాదాపు రూ. 200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శించారు. ముఖ్యంగా, అనుముల కొండల్ రెడ్డి తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో 'టెసరాక్' కంపెనీకి ఛైర్మన్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. మరో సోదరుడు జగదీశ్ రెడ్డి కాంట్రాక్టులు దక్కించుకుంటుండగా, ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు.

ప్రతిపాదిత ఫోర్త్ సిటీ పరిధిలోని భూముల కేటాయింపులపై బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఒకరోజు ముందే ఇవే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండల్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న టెసరాక్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మహేశ్వరం మండలం రావిర్యాలలో సుమారు ఐదు ఎకరాల భూమిని కేవలం రూ. 7 కోట్లకు కేటాయించారని, దాని అసలు మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని క్రిశాంక్ పేర్కొన్నారు. ఆ కంపెనీకి కేవలం రూ.లక్ష మూలధనం ఉందని, పటాన్‌చెరులోని ఒక చిన్న నివాసం నుంచి కార్యకలాపాలు సాగిస్తోందని ఆరోపించారు. కాగా, క్రిశాంక్ చేసిన ఆరోపణలను మంత్రి డి.శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు.
Advertisement
KTR
Revanth Reddy
Telangana Politics
BRS
Anumula Kondal Reddy
Tesseract Advanced Systems

More Telugu News