పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథ

Mauro Morandi The Man Who Lived Alone On An Island For 32 Years
  • 1989లో నగర జీవితంపై విసుగు చెందిన మౌరో మొరాండి
  • సముద్ర ప్రయాణం మొదలుపెట్టి పాలినీషియాకు వెళ్లిన వైనం
  • పడవ మధ్యలోనే పాడవడంతో బుడెల్లీ దీవికి చేరుకున్న మొరాండి 
  • పింక్‌ బీచ్‌తో ప్రసిద్ధి చెందిన బుడెల్లీ దీవి
  • 3 దశాబ్దాలకు పైగా ఆ దీవికి కాపలాదారుగా మారిన మొరాండి
  • 2025 జనవరి 3న మోడెనాలో 85 ఏళ్ల వయసులో కన్నుమూత
మనలో చాలామందికి ఫోన్‌ బ్యాటరీ 20 శాతానికి పడిపోతేనే కంగారు మొదలవుతుంది. కానీ ఇటలీకి చెందిన మౌరో మొరాండి జీవితంలో పడవ ఇంజిన్‌ పాడవడం మాత్రం ఓ కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ప్రయాణం మధ్యలో పడవ ఆగిపోయింది. దాన్ని బాగు చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అతడు.. అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా ఓ చిన్న దీవిలో ఒంటరిగా ఏకంగా 32 ఏళ్లు గడిపాడు.

అనుకోకుండా దీవిలోకి..
మొరాండి 1939లో ఉత్తర ఇటలీలోని మోడెనా పట్టణంలో జన్మించాడు. గతంలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1989లో నగర జీవితం విసుగు తెప్పించడంతో సముద్ర ప్రయాణం మొదలుపెట్టాడు. పాలినీషియాకు వెళ్లాలని బయలుదేరాడు. కానీ సార్డీనియా ఉత్తర తీరంలోని మద్దలెనా దీవుల సమీపంలో అతడి కాటమరాన్‌ ఇంజిన్‌ పాడైంది.

దగ్గర్లోని బుడెల్లీ దీవికి చేరుకున్న అతడికి అక్కడి సంరక్షకుడు త్వరలో బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న విషయం తెలిసింది. అంతే.. తన పడవను అమ్మేసి ఆ బాధ్యతను తానే తీసుకున్నాడు.

గులాబీ రంగు ఇసుక
బుడెల్లీ దీవి ‘పింక్‌ బీచ్‌’తో ప్రసిద్ధి చెందింది. అక్కడి ఇసుకకు గులాబీ రంగు రావడానికి సముద్రంలో ఉండే చిన్న జీవుల అవశేషాలు, పగడాలు, గుల్లలు కారణం. ఈ అరుదైన బీచ్‌ను రక్షించేందుకు 1994లో ఇటలీ ప్రభుత్వం సందర్శకుల రాకను చాలావరకు నిలిపివేసింది.

మొరాండి అక్కడి రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ చిన్న ఇంట్లో ఉండేవాడు. దారులను శుభ్రంగా ఉంచేవాడు. ఇసుకపై చెత్త పడకుండా చూసేవాడు. పర్యాటకులకు బీచ్‌ ప్రత్యేకతను వివరించేవాడు. ఇలా మూడు దశాబ్దాలకు పైగా ఆ దీవికి కాపలాదారుగా మారిపోయాడు.

ఒంటరితనం.. అతడికి మాత్రం ఇష్టం
శీతాకాలంలో ఒక్కోసారి 20 రోజుల వరకు అతడిని కలిసేందుకు ఎవరూ వచ్చేవారు కాదు. పుస్తకాలు చదువుతూ, జునిపర్‌ చెక్కతో చిన్న బొమ్మలు తయారు చేస్తూ, సముద్రం రంగు మారడాన్ని చూస్తూ కాలం గడిపేవాడు. నిశ్శబ్దమే తనకు అన్నింటికంటే ఇష్టమని చెప్పేవాడు.

చివరకు దీవిని వదిలి..
బుడెల్లీ యాజమాన్యంపై కొన్నేళ్ల పాటు వివాదం నడిచింది. 2016లో కోర్టు ఈ దీవి ఇటలీలోని మద్దలెనా జాతీయ ఉద్యానవనంలో భాగమని తేల్చింది. దీవిని పర్యావరణ విద్యా కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో అధికారులు మొరాండిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. ఆయనకు మద్దతుగా 18 వేల మందికి పైగా సంతకాలు చేసినా.. చివరకు 2021 ఏప్రిల్‌లో దీవిని వదిలి వెళ్లాడు.

తర్వాత సమీపంలోని లా మద్దలెనా దీవిలో నివసించాడు. వయసుతో సంబంధం లేకుండా జీవితాన్ని మరోసారి కొత్తగా మొదలుపెట్టడం సంతోషంగా ఉందన్నాడు. మొరాండి 2025 జనవరి 3న మోడెనాలో 85 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఓ పడవ ఇంజిన్‌ పాడవడంతో మొదలైన ప్రయాణం.. చివరకు అతడిని 32 ఏళ్ల పాటు ఓ అరుదైన దీవికి కాపలాదారుగా మార్చింది.
Advertisement
Mauro Morandi
Budelli Island
Pink Beach Italy
Island Hermit
Sardinia Caretaker
Mauro Morandi Death

More Telugu News