బండి సంజయ్ బతుకంతా మత రాజకీయమే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- బోనాల పండుగలను బీజేపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ఆది శ్రీనివాస్
- కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని వ్యాఖ్య
- మహంకాళి అమ్మవారికి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారన్న శ్రీనివాస్
కేంద్ర మంత్రి బండి సంజయ్ బతుకంతా మతం పేరు చెప్పుకుని రాజకీయం చేయడమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కూడా బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిందని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తుచేశారు. బోనాల ఏర్పాట్లపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవించే లౌకిక ప్రభుత్వమని స్పష్టం చేశారు.
హిందూ ధర్మాన్ని, ప్రాచీన ఆలయాలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పునర్నిర్మాణానికి రూ.250 కోట్లు, బాసరకు రూ.225 కోట్లు, భద్రాచలానికి రూ.351 కోట్లు, గోదావరి పుష్కరాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించామని వివరించారు. అలాగే మొయినాబాద్, వేములవాడలలో రూ.197 కోట్లతో ఆధునిక గోశాలలను నిర్మిస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆలయాల అభివృద్ధికి ఇంత భారీగా నిధులు కేటాయించారా? అని ప్రశ్నించిన ఆయన.. సంజయ్కి చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.