నాగార్జునసాగర్లో వైభవంగా ప్రారంభమైన ‘మహా వరుణ యాగం’: పాల్గొన్న మంత్రి ఉత్తమ్ దంపతులు
- విస్తారంగా వర్షాలు కురవాలని తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం
- 108 మంది వేద పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో యాగం
- పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులన్నీ జలకళతో నిండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్లోని విజయ్విహార్ ప్రాంగణంలో ‘మహా వరుణ యాగం’ ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి - పద్మావతి దంపతులు ఆదిపూజ నిర్వహించి యాగ క్రతువును శాస్త్రోక్తంగా ప్రారంభించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది వేద పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో 11 హోమగుండాలతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ యాగం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుండగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ క్రతువులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖలతో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. డ్యామ్లు, చెరువుల్లో నీటిమట్టాలు పెరిగి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది.