హుస్సేన్ సాగర్‌లో టేకాఫ్.. ప్రకాశం బ్యారేజీలో ల్యాండింగ్.. రెండు రాష్ట్రాల సీ ప్లేన్ సర్వీసులు

Sea Plane services takeoff from Hussain Sagar and landing at Prakasam Barrage
  • హైదరాబాద్-విజయవాడ మధ్య సీ-ప్లేన్ సర్వీసులు
  • తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపై కేంద్రం సానుకూలత
  • హుస్సేన్‌సాగర్‌లో ఏఏఐ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
  • ఒకేసారి 9 నుంచి 12 మంది ప్రయాణించే వీలు
  • రెండు రాష్ట్రాల మధ్య పర్యాటకానికి కొత్త ఊపు
తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త పర్యాటక శకానికి శ్రీకారం చుట్టే సీ-ప్లేన్ ప్రాజెక్టు ఊహల నుంచి ఆచరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, కేంద్రం సానుకూలతతో ఈ ప్రతిష్ఠాత్మక పథకం పట్టాలెక్కుతోంది. ఈ క్రమంలోనే, హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో 'వాటర్ ఏరోడ్రోమ్' ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేశారు. హుస్సేన్‌సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు విమానంలో ప్రయాణించే అద్భుత అనుభూతిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా కసరత్తు ముమ్మరమైంది.

ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమై ఈ ప్రతిపాదనను చర్చించారు. హుస్సేన్‌సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సీ-ప్లేన్ సేవలు ప్రారంభిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చల అనంతరం ప్రాజెక్టులో వేగం పుంజుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉన్నతాధికారుల బృందం నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. సీ-ప్లేన్‌లు సురక్షితంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడానికి అవసరమైన వాటర్ ఏరోడ్రోమ్ పాయింట్లు, నీటి లోతు, ప్రయాణికుల రాకపోకలకు అనువైన ప్రాంతాలపై ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఈ బృందం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా ఇదే తరహా సర్వే నిర్వహించనుంది.

సీ-ప్లేన్‌ల కోసం ప్రత్యేకంగా రన్‌వే అవసరం లేదు. నీటిపైనే దిగి, అక్కడి నుంచే గాల్లోకి ఎగురుతాయి. వీటి కోసం ‘వాటర్ ఏరోడ్రోమ్’లను నిర్మిస్తారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో సీ-ప్లేన్‌లో 9 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ట్రయల్ రన్స్ జరిగినా, ఈసారి పూర్తిస్థాయి సర్వీసులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఏఏఐ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకోనున్నాయి.
Advertisement
Sea Plane Services
Hussain Sagar
Prakasam Barrage
Revanth Reddy
Ram Mohan Naidu
Water Aerodrome

More Telugu News