కృష్ణా జిల్లా కోచింగ్ హాస్టల్‌లో హైదరాబాద్ యువతి అనుమానాస్పద మృతి

Hyderabad girl suspicious death in Krishna district coaching hostel
  • కృష్ణా జిల్లాలో నీట్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
  • హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల వైష్ణవిగా గుర్తింపు
  • ఇంటికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పిన యువతి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసుల విచారణ
వైద్య విద్యా ప్రవేశ పరీక్ష (నీట్) కోసం శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి (19), జిల్లాలోని కానూరులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ హాస్టల్‌లో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన వైష్ణవి, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ నిమిత్తం మూడు వారాల క్రితం కృష్ణా జిల్లాలోని శ్రీ భారతి ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. అప్పటి నుంచి ఆమె అక్కడి హాస్టల్‌లోనే ఉంటూ శిక్షణ పొందుతోంది. అయితే, ఇంటికి దూరంగా ఉండటం ఇబ్బందిగా ఉందంటూ ఇటీవల తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. దానికి వారు ఆమెను ఓదార్చి, భవిష్యత్తు కోసం ధైర్యంగా ఉండాలని నచ్చజెప్పారు.

ఈ నేపథ్యంలోనే వైష్ణవి హాస్టల్‌లో మృతి చెందడంతో, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కృష్ణా జిల్లాకు చేరుకున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.                                
Advertisement
Vaishnavi
Krishna district
NEET student death
Kanuru hostel
Hyderabad girl
Sri Bharati Institute

More Telugu News