రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శనాస్త్రాలు

YS Jagan Mohan Reddy slams alliance government over farmer suicides
  • దేవరపల్లిలో పొగాకు రైతులను కలిసిన వైఎస్ జగన్
  • కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తీవ్ర ఆరోపణలు
  • పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన
  • వైసీపీ హయాంలో ఉన్న సున్నావడ్డీ, రైతు భరోసా పథకాలు రద్దు చేశారని విమర్శ
  • ప్రభుత్వం సిండికేట్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తోందని జగన్ ధ్వజం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన, పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు.

పొగాకు బ్యారన్లను పరిశీలించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. "మా ప్రభుత్వ హయాంలో కిలో పొగాకుకు సగటున రూ.289 ధర పలికింది. కొందరు రైతులు రూ.365 వరకు కూడా పొందారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ధర రూ.236కు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరుగుతుంటే, గిట్టుబాటు ధర తగ్గిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు" అని జగన్ అన్నారు. ప్రభుత్వం కేవలం 21 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలిన పంట విషయంలో వ్యాపారులు, సిండికేట్లతో కుమ్మక్కై రైతులను దగా చేస్తోందని విమర్శించారు.

గిట్టుబాటు ధర లేకపోవడంతో వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని జగన్ వెల్లడించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ వెళ్లకపోవడం దారుణమన్నారు. తమ హయాంలో అమలు చేసిన సున్నా వడ్డీ రుణాల పథకాన్ని, రైతు భరోసా కింద అదనంగా ఇచ్చే సహాయాన్ని రద్దు చేశారని, ఉచిత పంటల బీమాను కూడా ఎత్తివేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Andhra Pradesh farmers suicide
Tobacco price drop AP
Chandrababu Naidu government
Devarapalli East Godavari
YSRCP farmer protest

More Telugu News