నిరసనల్లో పాల్గొనే యువత పట్ల అత్యంత సహనంతో వ్యవహరించాలి: సుప్రీంకోర్టు
- హింసను అదుపు చేసే క్రమంలో బలగాలు జాగ్రత్తగా ఉండాలన్న సుప్రీంకోర్టు
- యువత ఎదురుదాడికి దిగితే పరిస్థితులు మరింత దారి తప్పే ప్రమాదముందని హెచ్చరిక
- యువత హింసాత్మక మార్గాల వైపు వెళ్లకుండా చూడటమే అధికారుల ప్రాథమిక విధి అని వ్యాఖ్య
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఆందోళనలు, వాటి సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థుల పట్ల అధికారులు అత్యంత విచక్షణతో, సహనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. హింసను అదుపు చేసే నెపంతో భద్రతా బలగాలు కూడా అంతే తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగితే పరిస్థితులు మరింత దారి తప్పే ప్రమాదముందని హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు బీహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లలో సీజేపీ చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయని, జులై 20 నాటి నిరసనల్లో రాళ్లదాడి, హింస కారణంగా సార్వజనిక ఆస్తులకు జరిగిన నష్టానికి ఆ సంస్థనే బాధ్యులను చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కొత్త అర్జీని కూడా ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని విద్యార్థి ఆందోళనలకు సంబంధించిన ప్రధాన కేసులతో సుప్రీంకోర్టు జతచేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత ప్రదర్శనల సమయంలో పోలీసులు అత్యంత సంయమనం పాటించాలని సూచించిన సీజేఐ... యువత హింసాత్మక మార్గాల వైపు వెళ్లకుండా చూడటమే అధికారుల ప్రాథమిక విధి అని పేర్కొన్నారు. యువకులు అసలు ఏం కోరుకుంటున్నారు, వారి ఆవేదనకు కారణమేంటో ఓపికగా వినడమే అన్ని సమస్యలకు అత్యంత శక్తివంతమైన పరిష్కారమని వ్యాఖ్యానించారు. అయితే శాంతిభద్రతలను కాపాడే క్రమంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల విచక్షణపై తమకు నమ్మకం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలను పరిశీలించిన పిమ్మటే ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ధర్మాసనం తెలిపింది.