దేశంలోనే తొలిసారి బీసీ రక్షణ చట్టం: రెండేళ్ల కసరత్తు ఫలించిందన్న మంత్రి అచ్చెన్నాయుడు
- గత వైసీపీ ప్రభుత్వం బీసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్న అచ్చెన్నాయుడు
- టీడీపీ ముందు నుంచీ బీసీలకు అండగా ఉందని వ్యాఖ్య
- బీసీ రిజర్వేషన్లను చంద్రబాబు 27 శాతానికి పెంచారన్న అచ్చెన్న
బీసీల సంక్షేమం, భద్రత కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకువస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ రక్షణ చట్టం ముసాయిదాలోని కీలక వివరాలను ఆయన పంచుకున్నారు.
ఈ చట్ట రూపకల్పన కోసం గత రెండేళ్లుగా సుదీర్ఘంగా కసరత్తు చేశామని తెలిపిన మంత్రి... 2019-24 మధ్యకాలంలో గత ప్రభుత్వం బలహీనవర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, వారిపై జరిగిన వేధింపులను అరికట్టేందుకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ బీసీలకు అండగా ఉందన్న అచ్చెన్నాయుడు... నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు వాటిని 27 శాతానికి పెంచారని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న బలహీనవర్గాల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సబ్ కమిటీ... జిల్లాల వారీగా బీసీ సంఘాలు, ప్రజలతో మాట్లాడి సలహాలు స్వీకరిస్తుందని తెలిపారు.
శాసనసభలో ఈ బిల్లును ఆమోదించే ముందు కేంద్ర జాతీయ బీసీ కమిషన్ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, సర్వహక్కులతో అత్యంత శక్తివంతమైన చట్టంగా దీనిని అమలులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.