అమరావతే ఏపీ ఆత్మగౌరవం.. జగన్ పాలనపై విరుచుకుపడ్డ హోంమంత్రి అనిత
- అమరావతి పనులను పరిశీలించిన అనిత, కొండపల్లి శ్రీనివాస్
- మూడు రాజధానుల పేరుతో ప్రజలను జగన్ మోసగించారన్న అనిత
- అమరావతి పనులను ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపు
అమరావతి వేదికగా జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఆత్మగౌరవం అమరావతిలోనే ప్రతిబింబిస్తున్నాయని మంత్రులు స్పష్టం చేశారు. ఈరోజు రాజధాని పనుల పురోగతిని దగ్గరుండి పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ మూడు రాజధానుల పేరుతో సమయాన్ని వృథా చేస్తూ ప్రజలను మోసగించారని అనిత తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న అద్భుతమైన నిర్మాణాలను ప్రజాప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలంతా వచ్చి చూడాలని పిలుపునిచ్చారు. పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.
కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... రాజధాని నిర్మాణం కోసం తమ భూములను అందించిన రైతుల త్యాగాలు మరవలేనివని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో ‘వాక్ టూ వర్క్’ అనే వినూత్న కాన్సెప్ట్తో సెక్రటేరియట్, హెచ్ఓడీ భవనాలను నిర్మిస్తున్నారని, నివాస సముదాయాల నుంచి నడుచుకుంటూ వెళ్లి పనిచేసుకునేలా ఆధునిక వసతులతో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు.