మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పండి.. మెటాకు కేంద్రం అల్టిమేటం

Meta faces three day ultimatum from Center to apologize for PM Modi video removal
  • ప్రధాని వీడియో తొలగింపుపై జుకర్‌బర్గ్‌కు 3 రోజుల గడువు
  • క్షమాపణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచన
  • లేకపోతే సేఫ్ హార్బర్ రక్షణపై చర్యలుంటాయని హెచ్చరిక
  • సాంకేతిక లోపమే కారణమని మెటా వివరణ
  • మెటా వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి.
  • చిన్నారుల అసభ్యకర కంటెంట్‌పై సోషల్ మీడియా సంస్థలకు మరో హెచ్చరిక
భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు తొలగించిన ఘటనపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల గడువు విధించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సూచించింది.

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని ఈ కమిటీ, ప్రధాని వీడియో తొలగింపును ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణించింది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని వీడియోను తొలగించడం తీవ్రమైన విషయంగా పేర్కొంది.

మూడు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌కు ప్రస్తుతం ఉన్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను తొలగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించినట్టు సమాచారం. అలా జరిగితే సోషల్ మీడియా సంస్థ అధికారులపై నేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.

జులై 23న ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ వీడియోను పోస్టు చేశారు. తర్వాత అదే వీడియోను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేశారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో హామీ ఇచ్చారు. అయితే ఫేస్‌బుక్‌లో ఆ వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో వివాదం చెలరేగింది. విమర్శలు రావడంతో మెటా వెంటనే ఆ పోస్టును పునరుద్ధరించింది.

ఇటీవల పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరైన మెటా ప్రతినిధులు, ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిందని క్షమాపణ చెప్పారు. అయితే ఐటీ శాఖ ఆ వివరణను పూర్తిగా అంగీకరించలేదు. నిజంగా సాంకేతిక లోపమే అయితే అలాంటి సమస్యలు మళ్లీ రాకుండా మెటా తన వ్యవస్థలను మెరుగుపరచాలని సూచించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్‌ ప్రకటనల రూపంలో కనిపిస్తున్న వ్యవహారంపైనా మెటాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై పార్లమెంటరీ కమిటీ మరోసారి హెచ్చరిక జారీ చేసింది.

గూగుల్, యూట్యూబ్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలు చిన్నారులపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను కట్టడి చేసే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిటీ స్పష్టం చేసింది. ఉల్లంఘనలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Advertisement
Meta
Mark Zuckerberg
Narendra Modi
Parliamentary Committee
Facebook video removal
Safe Harbor protection

More Telugu News