పాక్ వేడుకున్నా వెంటనే ఒప్పుకోలేదు.. ఆపరేషన్ సిందూర్‌పై సీడీఎస్‌ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు

Anil Chauhan key comments on Operation Sindoor India did not agree immediately despite Pakistan plea
  • ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థానే కాల్పుల విరమణ కోరినట్లు సీడీఎస్‌ వెల్లడి
  • వారి విన్నపాన్ని వెంటనే అంగీకరించలేదన్న జనరల్‌ అనిల్‌ చౌహాన్‌
  • భారత్‌ ప్రణాళికలో ఉన్న దాడులన్నీ పూర్తైన తర్వాతే స్పందించినట్లు వెల్లడి
  • పాక్‌ సైనిక స్థావరాలు భారత పరిధిలో ఉన్నాయని తెలియజేయడమే లక్ష్యమని వివరణ
ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం పాకిస్థాన్ కోరినా, వెంటనే అంగీకరించలేదని భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. భారత్ నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించినట్టు చెప్పారు.

ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడిన చౌహాన్.. 2025 మే 10న ఉదయం డీజీఎంఓ హాట్‌లైన్ ద్వారా పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరినట్లు వెల్లడించారు. అయితే అప్పటికీ భారత ప్రణాళికలో ఉన్న దాడుల్లో సగం కూడా పూర్తి కాలేదని తెలిపారు. అందుకే వెంటనే స్పందించకుండా మధ్యాహ్నం వరకు ఆపరేషన్ కొనసాగించామని వివరించారు.

మే 9 రాత్రి నుంచి మే 10 మధ్యాహ్నం వరకు పాకిస్థాన్‌లోని 11 సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలపై భారత్ దాడులు జరిపిందని తెలిపారు. హ్యాంగర్లు, రాడార్ కేంద్రాలు, యుద్ధ విమానాలకు గణనీయమైన నష్టం వాటిల్లిందన్నారు. పాకిస్థాన్‌లోని ఏ సైనిక స్థావరమైనా భారత బలగాల పరిధిలోనే ఉందనే సందేశం ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు.

రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, రహీమ్ యార్ ఖాన్, భోలారి వంటి కీలక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఆ స్థావరాల్లో ఇప్పటికీ మరమ్మతులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

పాకిస్థాన్ తమ దాడులు విజయవంతమయ్యాయని భావించి తొలుత ధీమా ప్రదర్శించినా, భారత ప్రతిదాడుల తీవ్రత చూసి వెనక్కి తగ్గిందని అనిల్ చౌహాన్ అన్నారు. యుద్ధం కొనసాగితే మరింత నష్టం తప్పదని పాక్‌ గ్రహించిందని వివరించారు.

ఉదయం 9.30 గంటలకే కాల్పుల విరమణ కోరినా, వెంటనే అంగీకరించలేదని చెప్పారు. మరింత స్పష్టమైన విజయం సాధించాలనే ఉద్దేశంతో మరో రెండు దఫాల దాడులు జరిపిన తర్వాతే కాల్పుల విరమణకు అంగీకరించినట్టు వెల్లడించారు.

2025 మే 7న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. తొలి దశలో పాకిస్థాన్‌లోని జైష్-ఎ-మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. అనంతరం పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడికి ప్రయత్నించగా, వాటిని భారత బలగాలు అడ్డుకున్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ సైనిక స్థావరాలపై భారత్ దాడులు మరింత ఉద్ధృతం చేసింది.

యుద్ధభూమిలో పరిస్థితులను వేగంగా అంచనా వేసే సామర్థ్యం భారత బలగాలకు ప్రధాన బలమని అనిల్ చౌహాన్ అన్నారు. తమ దాడుల ప్రభావంతో పాటు పాకిస్థాన్ దాడుల ఫలితాలను కూడా త్వరగా విశ్లేషించగలిగామని, అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
Advertisement
Anil Chauhan
Operation Sindoor
India Pakistan conflict
Pakistan military bases
DGMO hotline ceasefire
Pahalgam terror attack retaliation

More Telugu News