కర్ణాటక కాంగ్రెస్‌లో రెబెల్ మంటలు.. క్యాబినెట్ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేల రాజీనామా డ్రామా!

Rebel fire in Karnataka Congress MLA resignation drama after cabinet expansion
  • కర్ణాటకలో మంత్రి పదవులు దక్కక కాంగ్రెస్‌లో మొదలైన రాజీనామాలు
  • రాజీనామాలను నిమిషాల్లో ఆమోదిస్తానన్న సీఎం డీకే శివకుమార్
  • 2028లో పార్టీ పతనం తప్పదంటూ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్య
  • అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ కలకలం రేపుతోంది. మంత్రి పదవులు దక్కని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసమ్మతి స్వరం వినిపిస్తుండటంతో పార్టీలో సంక్షోభం ముదురుతోంది. కొందరు రాజీనామాలకు సిద్ధపడగా, మరికొందరు పార్టీ భవిష్యత్తుపైనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ ఇప్పటికే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సాగర్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణతో పాటు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో డీకే శివకుమార్ పార్టీని నడపడం కష్టమని, 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరిచినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

ఈ తిరుగుబాటు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. "రాజీనామా చేయాలనుకునే వారు నిరభ్యంతరంగా చేయవచ్చు. వారి రాజీనామాలను నిమిషాల్లో ఆమోదిస్తాను. ఎవరినీ బలవంతంగా ఆపలేం" అని ఘాటుగా హెచ్చరించారు. పార్టీ భవిష్యత్తు ముఖ్యమనుకునే వారు ఇక్కడే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

పరిస్థితి చేయి దాటుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి బోర్డులు, కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు ఆఫర్ చేస్తున్నప్పటికీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. ఒకవేళ నేతలు పట్టు వీడకపోతే వారి రాజీనామాలను ఆమోదించడానికి కూడా వెనుకాడవద్దని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Advertisement
DK Shivakumar
Karnataka Congress Crisis
Karnataka Cabinet Expansion
Yashwanthrayagouda Patil
Randeep Surjewala
Karnataka Politics News

More Telugu News