రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి: సీఎం చంద్రబాబు

Remove unnecessary regulations in transport department CM Chandrababu
  • తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
  • ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సమీక్ష
  • రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించి, సేవలు సులభతరం చేయాలని సూచన
  • పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్‌లో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ
రవాణా శాఖలో అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించి ప్రజలకు సులభతరమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం కీలక సూచనలు చేశారు.

రవాణా శాఖలో సంస్కరణలకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు, ఫారం-5బీ వంటి పరీక్షల తొలగింపు ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చూడవచ్చని తెలిపారు. ఈ చర్యలతో ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దశలవారీగా ఈ సంస్కరణలను అమలు చేసేందుకు తాము ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు చెప్పగా, వీలైనంత త్వరగా అనవసర నిబంధనలను తొలగించి, ప్రజలకు ఇబ్బందులు లేని వ్యవస్థను రూపొందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ సమీక్షలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై కూడా సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఎల్ నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, ఈ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నందున కృష్ణా బేసిన్‌లోకి నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందని, కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.

వర్షాభావం కారణంగా భవిష్యత్తులో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందని, దీనికి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని, ల్యాబ్ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Advertisement
Chandrababu Naidu
AP Transport Department
Transport Reforms
Water Scarcity Management
RTGS Review Meeting
Andhra Pradesh Government

More Telugu News