జగన్ డైరెక్షన్ లోనే అటవిక చర్యలు.. రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజు దగ్గరపడింది: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy slams Jagan Mohan Reddy for directing atrocities in Andhra Pradesh
  • జగన్ అండతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్న మంత్రి
  • కర్నూలులో దళిత కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యే దాడి అమానుషం అని వ్యాఖ్యలు
  • దళితులు, మహిళలపై దాడులు జరుగుతున్నా జగన్ మౌనం దారుణమంటూ విమర్శలు
  • తప్పు చేస్తే సొంత నేతలనూ చంద్రబాబు మందలిస్తారని వెల్లడి
  • అరాచక శక్తులను ఉపేక్షించం, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రాష్ట్రంలో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాల వెనుక ఆ పార్టీ అధినేత జగన్ డైరెక్షన్ ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పెంచి పోషిస్తున్న రౌడీ మూకల ఆటవిక చర్యలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజు దగ్గరపడిందని ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు.

"ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుకు బాటలు వేస్తుంటే, మరోవైపు ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేని వైసీపీ.. యువతను గంజాయి, రౌడీయిజం వైపు మళ్లించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. కులాల మధ్య చిచ్చుపెట్టడం, విధ్వంసం సృష్టించడమే వైసీపీలో కొనసాగడానికి అర్హతగా మారింది. తప్పు చేసి దొరికిపోయాక, 'రాజకీయ కక్ష సాధింపు' అంటూ సోషల్ మీడియాలో ఏడవడం ఆ పార్టీకి అలవాటైంది" అని పార్థసారధి ఎద్దేవా చేశారు.

కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఒక దళిత కుటుంబంపై బరిసెలు, మారణాయుధాలతో దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మంత్రి తీవ్రంగా ఖండించారు. "ఒక దళిత సోదరి ఇంట్లోకి చొరబడి, ఆమె బట్టలు చించి అవమానించి, పైగా బాధితులే బట్టలు చించుకున్నారని సిగ్గులేకుండా ప్రచారం చేయడం వైసీపీ నీచ రాజకీయాలకు పరాకాష్ఠ. శ్రీకాకుళంలో మహిళా సీఐని అవమానించిన ఘటన నుంచి నేటి వరకు దళితులు, మహిళలపై వైసీపీ నేతల దాడులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

45 ఏళ్లు దాటిన గొర్రెల కాపరి మరణంపై జగన్ చేసిన వ్యాఖ్యలు, పేదల ప్రాణాలంటే ఆయనకున్న చులకన భావాన్ని, విపరీత మనస్తత్వాన్ని బయటపెట్టాయని అన్నారు.

తమ పార్టీ నేతలు తప్పు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించి సరైన మార్గంలో పెడతారని, కానీ జగన్ మాత్రం తన పార్టీ నేతల అరాచకాలకు అండగా నిలుస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారని పార్థసారథి విమర్శించారు. 

"నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఎన్నికల ముందు నాటకాలు ఆడిన జగన్, ఇప్పుడు అదే దళితులు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎంతటివారైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని, దోషులకు కఠిన శిక్షలు తప్పవని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు. ఇటువంటి అరాచక శక్తులను కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు.


Advertisement
Kolusu Parthasarathy
Jagan Mohan Reddy
YSRCP Atrocities
Andhra Pradesh Politics
Kurnool Dalit Family Attack
TDP Press Meet

More Telugu News